India: మరింతగా పెరిగిపోతున్న బంగారం, వెండి ధరలు!

  • అక్టోబర్ ఫ్యూచర్స్ లో మరింత పెరిగిన ధర
  • రూ. 55,300కు చేరిక
  • రూ. 72,854కు కిలో వెండి ధర
Gold Price Sores Record High

బంగారం ధరలు మరింతగా పెరిగాయి. అక్టోబర్ ఫ్యూచర్స్ మార్కెట్ లో 10 గ్రాముల పసిడి ధర రూ. 202 పెరిగి రూ. 55,300కు చేరింది. దీంతో స్పాట్ మార్కెట్లో ధరలు మరింతగా పెరుగుతాయని బులియన్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇదే సమయంలో మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ లో వెండి ధర కిలోకు రూ. 691 పెరిగి రూ. 72,584కు చేరింది. రెండు రోజుల క్రితం రూ. 4 వేలు పెరిగి, ఆల్ టైమ్ రికార్డుగా రూ. 76 వేల మార్క్ ను దాటేసిన వెండి ధర, బుధవారం అంతే మొత్తం తగ్గింది. వెండి ధర మరోమారు రికార్డు స్థాయులను దాటుతాయని భావిస్తున్నారు.

కాగా, అంతర్జాతీయ మార్కెట్లో వరుసగా ఆరోరోజూ ధరలు పెరిగాయి. న్యూయార్క్ లో ఔన్సు బంగారం ధర 0.6 శాతం పెరిగి 2,081 డాలర్లను దాటింది. వెండి ధర ఏకంగా 2.5 శాతం పెరిగి 29.12 డాలర్లకు చేరుకుంది. 2013 తరువాత వెండి ధర ఈ స్థాయికి రావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.

ఇక స్పాట్ మార్కెట్ విషయానికి వస్తే, నేడు బంగారం ధర రూ. 55,845 వద్ద ఉండగా, వెండి ధర రూ. 76,360 వరకూ పెరిగి, ఆపై 76,052కు చేరుకుంది. కరోనా కారణంగా ఆర్థిక వ్యవస్థలు నష్టపోతున్న వేళ, తమ పెట్టుబడులకు బులియన్ మార్కెట్ అనువైనదని ఇన్వెస్టర్లు భావిస్తుండటంతోనే బులియన్ మార్కెట్ పరుగులు పెడుతోందని విశ్లేషకులు వ్యాఖ్యానించారు. బ్యాంకుల నుంచి చౌకగా తీసుకుంటున్న రుణాలతో పాటు, సంక్షోభ సమయంలో ప్రభుత్వాలు విడుదల చేస్తున్న నగదు సైతం ఇన్వెస్టర్ల చేతుల మీదుగా బంగారం వైపు మళ్లుతోందని, అందువల్లే గోల్డ్ ఈటీఎఫ్ లకు సైతం డిమాండ్ పెరిగిందని వెల్లడించారు.

More Telugu News