YS Vivekananda Reddy: వైయస్ వివేకానందరెడ్డి కుమార్తెను మూడు గంటల పాటు విచారించిన సీబీఐ

  • కడప సెంట్రల్ జైలు గెస్ట్ హౌసులో కేసు విచారణ
  • అధికారులకు ఆధారాలు, వివిధ డాక్యుమెంట్లను అందించిన సునీత
  • సీఐ శంకరయ్యను రెండో రోజు విచారించిన అధికారులు
CBI questions YS Vivekananda Reddys daughter

ఏపీ ముఖ్యమంత్రి జగన్ బాబాయ్, మాజీ మంత్రి వైయస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ ఊపందుకుంది. కడప సెంట్రల్ జైల్లో ఉన్న గెస్ట్ హౌస్ నుంచి సీబీఐ అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు. ఈరోజు వివేకా కుమార్తె సునీతను అధికారులు విచారించారు. మూడు గంటల పాటు ఆమె విచారణ కొనసాగింది. విచారణకు తన వద్ద ఉన్న ఆధారాలు, వివిధ డాక్యుమెంట్లను ఆమె తీసుకెళ్లినట్టు తెలుస్తోంది.

రాష్ట్ర ప్రభుత్వం వేసిన సిట్ పై తనకు నమ్మకం లేదని, సీబీఐ చేత కేసును విచారించాలంటూ సునీత హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఆమె పిటిషన్ ను విచారించిన హైకోర్టు సీబీఐ విచారణకు ఆదేశించింది. ఈ నేపథ్యంలో, పిటిషన్ లో ఆమె పేర్కొన్న వివరాలను సీబీఐ అధికారులు తెలుసుకున్నారు. తనకు అనుమానం ఉన్న 15 మంది వ్యక్తుల పేర్లను కూడా తెలిపారు.

మరోవైపు సస్పెన్షన్ కు గురైన పులివెందుల సీఐ శంకరయ్యను సీబీఐ అధికారులు రెండో రోజు విచారించారు. నిన్న కూడా ఆయనను నాలుగు గంటల సేపు విచారించారు. వివేకా హత్య జరిగిన సమయంలో శంకరయ్య సీఐగా ఉన్నారు.

More Telugu News