Corona Virus: తమిళనాడులో చెలరేగిపోతున్న కరోనా.. మరో 89 మంది మృతి

  • రాష్ట్రంలో గత 24 గంటల్లో 6,988 కేసులు
  • కోలుకున్న 7,758 మంది
  • చెన్నైని భయపెడుతున్న కేసులు, మరణాలు
Corona cases in tamilnadu crossed to 2 lakh

తమిళనాడులో కరోనా మహమ్మారి చెలరేగిపోతోంది. రోజూ వేల సంఖ్యలో కేసులు నమోదవుతుండడంతో ప్రజలు వణికిపోతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా నిన్న 89 మంది కరోనాకు బలయ్యారు. దీంతో కొవిడ్ కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 3,490కి పెరిగింది. అలాగే, మొత్తం కేసుల సంఖ్య 2 లక్షల మార్కును దాటేసి 2,06,737గా నమోదైంది. అదే సమయంలో కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది. నిన్న ఒక్క రోజే 7,758 మంది కోలుకుని డిశ్చార్జ్ అవడంతో మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 1,51,055కు పెరిగింది. రాష్ట్రంలో ఇంకా 52,273 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.

గత 24 గంటల్లో రాష్ట్రంలో 64,315 నమూనాలు సేకరించారు. అలాగే, 6,988 కేసులు నమోదయ్యాయి. ఇక, రాష్ట్రవ్యాప్తంగా నమోదవుతున్న కేసుల్లో చాలా వరకు రాజధాని చెన్నైలోనే నమోదవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. గత 24 గంటల్లో నగరంలో కొత్తగా 20 మంది మృత్యువాత పడగా, 1329 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 22,87,334 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్టు అధికారులు తెలిపారు.

More Telugu News