Bengaluru: బెంగళూరులో దారుణం.. ఎంత కరోనా అయితే మాత్రం... ఇళ్లను ఇలా సీల్ చేస్తారా?

  • రెండు ఇళ్ల తలుపులకు ఇనుప షీల్డులతో సీల్
  • విమర్శలకు దారి తీసిన బెంగళూరు అధికారుల నిర్వాకం
  • క్షమాపణలు చెప్పిన బీబీఎంపీ కమిషనర్ మంజునాథ ప్రసాద్
BBMP Officials Seal Two Houses with Metal Sheets

బెంగళూరు కార్పోరేషన్ అధికారులు చేసిన నిర్వాకం తీవ్ర విమర్శలకు దారి తీయగా, ఉన్నతాధికారులు వచ్చి క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. విషయంలోకి వెళితే, దోమలూరు లే అవుట్ లోని ఓ అపార్ట్ మెంటు ఫ్లాట్ లోని ఓ మహిళకు కరోనా సోకిందన్న కారణంతో, ఆమె ఫ్లాట్ తో పాటు పక్క ఫ్లాట్ కు కూడా మెటల్ షీల్డులతో బీబీఎంపీ (బృహత్ బెంగళూరు మహానగర పాలికే) సిబ్బంది సీల్ వేశారు. రెండు ఫ్లాటుల తలుపులకు అడ్డుగా షీల్డులు పెట్టి మేకులు కొట్టారు.

దీనిని చూసి, షాక్ అయిన అదే అపార్టుమెంటులోని సతీశ్ సంగమేశ్వరన్ అనే వ్యక్తి ఆ వైనాన్ని ఫొటోలు తీసి, ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. కరోనా వచ్చిన మహిళతో పాటు ఆ ఫ్లాటులో ఆమె ఇద్దరు పిల్లలు ఉన్నారనీ, ఆ పక్క ఫ్లాటులో ఇద్దరు వృద్ధ దంపతులు ఉన్నారనీ, ఇలా మెటల్ షీల్డులతో వారి ఇళ్ల తలుపులు సీల్ చేయడం వల్ల, ఒకవేళ వారి ఇళ్లలో అగ్ని ప్రమాదం సంభవిస్తే వారి గతి ఏమిటంటూ సతీశ్ ట్వీట్ చేశాడు.    

క్షణాలలో ఇది వైరల్ కావడంతో దీనిని మీడియా చానెళ్లు ప్రముఖంగా ప్రసారం చేశాయి. దీంతో అధికారుల తీరుపై విమర్శలు వచ్చాయి. ఈ సందర్భంగా కరోనా బాధిత మహిళ మాట్లాడుతూ, "ఉదయం మా అపార్ట్ మెంట్ మేనేజ్ మెంట్ కమిటీ సభ్యులతో కలసి కార్పోరేషన్ సిబ్బంది వచ్చారు. మా ఫ్లోర్ కి కింద సీల్ చేస్తున్నామని చెప్పారు. దాంతో నేను ఇంట్లోకి వెళ్లి తలుపులు వేసేసుకుని పనిలో పడిపోయాను. అయితే, కొన్ని గంటల తర్వాత వచ్చి చూస్తే మా తలుపులకు మెటల్ షీల్డులు బిగించి వున్నాయి. దాంతో ఒక్కసారిగా షాక్ అయ్యాను" అని చెప్పారు.  

ఇది బీబీఎంపీ కమిషనర్ ఎన్ మంజునాథ ప్రసాద్ దృష్టికి వెళ్లడంతో ఆయన వెంటనే స్పందించారు. వెంటనే సిబ్బందిని పంపించి, ఆ మెటల్ షీల్డులను తొలగింపజేశారు. "నాకు విషయం తెలియగానే బారికేడ్లను తీయించాను. ప్రతి ఒక్కరినీ గౌరవంగా చూడాలన్నది మా విధి. కంటెయిన్ మెంట్ అంటే, ఇన్ ఫెక్ట్ అయిన ప్రదేశంపై దృష్టి సారించి, ఇన్ ఫెక్ట్ కాని ప్రాంతాలను సురక్షితం చేయడమే. మా స్థానిక సిబ్బంది చేసిన పనితో ఇబ్బందులు పడ్డ ఆ కుటుంబాలకు క్షమాపణలు" అన్నారు.

More Telugu News