Chandrababu: మూడు రాజధానుల బిల్లుపై గవర్నర్‌కు చంద్రబాబు లేఖ

  • శాసన మండలి ఈ బిల్లులను తిరస్కరించలేదు
  • ఈ బిల్లులను మండలి సెలెక్ట్‌ కమిటీకి పంపాలని సూచించింది
  • రాజధాని తరలింపు అంశాలు హైకోర్టులో పెండింగ్‌లో ఉన్నాయి
  • ప్రజా ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకోవాలి
chandrababu writes letter to governor

ఆంధ్రప్రదేశ్‌ రాజధానుల బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్‌ బిశ్వభూషణ్ హరిచందన్‌ వద్దకు పంపిన నేపథ్యంలో ఆయనకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు బిల్లులు విభజన చట్టానికి వ్యతిరేకమని తెలిపారు. 2014లో తీసుకొచ్చిన విభజన చట్టం ఆధారంగా ఏపీ రాజధాని అమరావతియేనని ఆయన అన్నారు.

ఏపీలో రాజధానిని గుర్తించేందుకు కేంద్ర ప్రభుత్వం నిపుణుల కమిటీ ఏర్పాటు చేసిందని ఆయన అన్నారు. ఆ కమిటీ సిఫార్సుల మేరకే అమరావతిని రాజధానిగా ఎంపిక చేశారని వివరించారు. ఇప్పుడు ఆ బిల్లును కాదని అమరావతి ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు వైసీపీ సర్కారు ప్రయత్నిస్తోందని చంద్రబాబు తెలిపారు.

అమరావతి శిథిలాలపై మూడు రాజధానులు కట్టేందుకు ఈ బిల్లులు తెచ్చారని చంద్రబాబు చెప్పారు. శాసన మండలి ఈ బిల్లులను తిరస్కరించలేదని, ఈ బిల్లులను మండలి సెలెక్ట్‌ కమిటీకి పంపాలని సూచించిందని వివరించారు. రాజధాని తరలింపు అంశాలు హైకోర్టులో పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు. ప్రజా ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలిపారు.

More Telugu News