Vijay Malya: వివాద పరిష్కారానికి.. బ్యాంకులకు విజయ్ మాల్యా మరో ఆఫర్!

  • బ్యాంకులకు డబ్బులు ఎగ్గొట్టిన మాల్యా
  • మొత్తం రూ. 13,690 కోట్లు చెల్లిస్తా
  • సెటిల్ మెంట్ ప్యాకేజీని ముందుంచిన మాల్యా
Vijay Malya New Offer to Indian Banks

ఇండియాలోని బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టి, ప్రస్తుతం లండన్ లో తలదాచుకుని, తిరిగి స్వదేశానికి రాకుండా ఉండేందుకు పలు రకాల ఎత్తులు వేస్తున్న యూబీ గ్రూప్ మాజీ చైర్మన్ విజయ్ మాల్యా, ఇప్పుడు ఓ బంపరాఫర్ ను బ్యాంకుల కన్సార్టియం ముందుంచారు. తప్పించుకునే మార్గాలన్నీ ఒక్కొక్కటిగా మూసుకుపోయిన తరువాత, తన వివాదాన్ని పరిష్కరించుకునేందుకు ఆయన మరోమారు ముందుకు వచ్చారు. బ్రిటన్ తనను భారత్ కు అప్పగిస్తుందని, అక్కడికి వెళితే, జైలు జీవితం తప్పదన్న ఆందోళనలో ఉన్న ఆయన, గతంలో ఇచ్చిన ఆఫర్లతో పోలిస్తే, మరో ఆకర్షణీయమైన ఆఫర్ ను తెరపైకి తెచ్చారు.

గతంలో మాల్యా ఇచ్చిన ఆఫర్లను బ్యాంకుల కన్సార్టియం తిరస్కరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, బ్యాంకులతో పరిష్కారానికి సిద్ధంగా ఉన్నామని సుప్రీంకోర్టుకు మాల్యా తరఫు న్యాయవాది తెలిపారు. బ్యాంకుల నుంచి విజయ్ మాల్యా రూ. 9 వేల కోట్ల రుణాలను పొందగా, అది వడ్డీతో కలిపి రూ. 13,960 కోట్లకు చేరింది. ఈ మొత్తాన్ని తిరిగి వెనక్కు తెచ్చేందుకు సీబీఐ, ఈడీ తదితర భారత సంస్థలు రంగంలోకి దిగాయి.

ఈ నేపథ్యంలో, తాను చెల్లించాల్సిన మొత్తం డబ్బును తిరిగి చెల్లిస్తానంటూ సెటిల్ మెంట్ ప్యాకేజ్ ఆఫర్ ను మాల్యా తెరపైకి తెచ్చారు. మాల్యాను తిరిగి ఇండియాకు అప్పగించాలంటూ బ్రిటన్ కోర్టులు ఆదేశించిన తరువాత, కొన్ని చట్టపరమైన సమస్యలు ఉన్నాయని చెబుతూ, బ్రిటీష్ హై కమిషన్ ఈ ప్రక్రియకు తాత్కాలిక బ్రేకులు వేసింది. ఇదే సమయంలో తనను శరణార్థిగా పరిగణించి, బ్రిటన్ లో ఉండేందుకు అనుమతించాలని మాల్యా పెట్టుకున్న పిటిషన్ ప్రస్తుతం పెండింగ్ లో ఉంది. ఈ నేపథ్యంలో మాల్యా నుంచి ఇటువంటి ఆఫర్ రావడం గమనార్హం.

More Telugu News