Mahabubabad District: మహబూబాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు కూలీల దుర్మరణం

  • అక్రమంగా కర్రలోడు తరలిస్తుండగా లారీ బోల్తా 
  • ప్రమాద సమయంలో 11 మంది కూలీలు
  • బాధితులు రంగారెడ్డి జిల్లా మంచాల మండలవాసులుగా గుర్తింపు
4 dead in a road accident held in Mahabubabad dist

మహబూబాబాద్ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు కూలీలు దుర్మరణం పాలయ్యారు. తొర్రూరు మండలం చీకటాయపాలెం గ్రామంలోని ఎక్కలదాయమ్మ చెరువు కట్ట వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. అక్రమంగా కర్రలోడును తరలిస్తున్న లారీ ఒక్కసారిగా అదుపుతప్పి బోల్తా పడింది. ప్రమాద సమయంలో లారీలో మొత్తం 11 మంది కూలీలు ఉన్నట్టు తెలుస్తోంది. ఘటనా స్థలంలోనే నలుగురు కూలీలు ప్రాణాలు కోల్పోయారు.

సమాచారం అందుకున్న పోలీసులు, ఆర్డీవో ఈశ్వరయ్య ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.  ప్రమాదం నుంచి స్వల్ప గాయాలతో బయటపడిన ఏడుగురు కూలీలను రంగారెడ్డి జిల్లా మంచాల మండలంలోని ఆంబోతుల తండాకు చెందిన వారిగా గుర్తించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News