China: నా సోదరిని చైనా ప్రభుత్వం కిడ్నాప్ చేసి హింసిస్తోంది: అమెరికా సామాజికవేత్త రుషాన్ అబ్బాస్

  • జిన్ జియాంగ్ ప్రాంతంలోని ఉఘర్ మహిళలపై చైనా దారుణాలు
  • మానవహక్కుల కోసం గొంతెత్తి నందుకేనన్న రుషాన్
  • కాన్సంట్రేషన్ క్యాంపుల్లో 30 లక్షల మంది ఉఘర్ మహిళలు
Rushan Abbas fires on china

అమెరికాకు చెందిన ప్రముఖ సామాజికవేత్త రుషాన్ అబ్బాస్ చైనాపై తీవ్ర ఆరోపణలు చేశారు. తన సోదరి, మెడికల్ డాక్టర్ అయిన డాక్టర్ గుల్షాన అబ్బాస్‌ను 28 సెప్టెంబరు 2018లో చైనా ప్రభుత్వం కిడ్నాప్ చేసిందని, ఆమె గురించిన సమాచారం ఇప్పటి వరకు లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ఆమెపై ఎటువంటి కేసు నమోదు కాలేదని, అసలు ఆమెను ఎందుకు కిడ్నాప్ చేశారన్న వివరాలు కూడా తెలియదని పేర్కొన్నారు. ఈ మేరకు ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. అంతేకాదు, తన స్నేహితురాళ్లను కూడా చైనా ప్రభుత్వం నిర్బంధించిందని ఆరోపించారు. చైనాలో అడుగంటిపోతున్న మానవహక్కుల కోసం తాను గొంతెత్తినందుకే ప్రభుత్వం ఇలాంటి దారుణాలకు తెగబడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

1949లో చైనా తమ భూభాగాన్ని ఆక్రమించినప్పటి నుంచి ఇలాంటి దురాగతాలకు పాల్పడుతోందని, ఉఘర్ ముస్లింలను లక్ష్యంగా చేసుకుందని రుషాన్ మండిపడ్డారు. శిబిరాల నుంచి బయటకు వచ్చే మహిళలకు పిల్లలు పుట్టకుండా సర్జరీలు చేస్తారని, తిండి పెట్టకుండా, నీళ్లు ఇవ్వకుండా అధికారులు హింసిస్తారని ఆవేదన వ్యక్తం చేశారు.

రహస్య శిబిరాల్లో ఇప్పటికే 30 లక్షల మంది ఉఘర్ మహిళలు మగ్గిపోతున్నారని పేర్కొన్నారు. చైనాలోని జిన్‌జియాంగ్ ప్రాంతంలో ఉఘర్ ముస్లింలను నిర్బంధించి వారిపై అత్యాచారాలకు పాల్పడడం, బలవంతంగా పెళ్లి చేసుకుని జనాభాను పెంచే ప్రయత్నం చేస్తున్నట్టు ఏళ్ల తరబడి ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో తాజాగా రుషాన్ వ్యాఖ్యలు ఇందుకు మరింత బలం చేకూరుస్తున్నాయి. అక్కడి కాన్సంట్రేషన్ క్యాంపులు ఇలాంటి ఎన్నో దారుణాలకు అడ్డాగా మారుతున్నాయి. 2014లో ఒకే ఒక్క శిబిరం వుండగా, ఇప్పుడు ఏకంగా 500 శిబిరాలు వుండడం గమనార్హం.

More Telugu News