Harish Rao: నిస్సార్ తన పాటల ప్రయాణాన్ని అర్థాంతరంగా ఆపేసిండు: హరీశ్ రావు ఆవేదన

  • ప్రజాగాయకుడు నిస్సార్ కరోనాతో మృతి
  • తెలంగాణ పాటను సారవంతం చేశాడన్న హరీశ్ రావు
  • నిస్సార్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి
Harish Rao responds on Nissar death

తెలంగాణలో ఉద్యమ గాయకుడిగా పేరు ప్రఖ్యాతులు అందుకున్న జన గాయకుడు నిస్సార్ కరోనాతో మృతి చెందిన విషయం తెలిసి మంత్రి హరీశ్ రావు ఆవేదనకు లోనయ్యారు. తెలంగాణ పాటను సారవంతం చేసిన కళాకారుడు నిస్సార్ అని కీర్తించారు. 'ఆర్టీసీ కండక్టర్ గా పనిచేసిన నిస్సార్ తన పాటల ప్రయాణాన్ని అర్థాంతరంగా ఆపేసిండు' అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. పేద ముస్లిం కుటుంబంలో జన్మించిన అతను అనేక ఉద్యమాలకు పాటల ప్రాణవాయువునిచ్చాడని కొనియాడారు. నల్లగొండ జిల్లా ఉద్యమ చైతన్యాన్ని ఆవాహన చేసుకున్న నిస్సార్.. అంటూ ట్విట్టర్ లో స్పందించారు.

ప్రపంచీకరణ మాయలో కరిగిపోతున్న తెలంగాణ జానపద సాంస్కృతిక కళారూపాలను తలపోస్తూ వలపోసిన వాగ్గేయకారుడు అని హరీశ్ రావు అభివర్ణించారు. నిస్సార్ ఆలపించే 'పండు వెన్నెల్లలోన పాడేటి పాటలేమాయె' అనే పాట 'తెలంగాణ ధూం ధాం' సభల్లో పెద్ద ఆకర్షణగా ఉండేదని తెలిపారు. తెలంగాణ ఉద్యమ జ్వాలా గీతం వంటి నిస్సార్ కు కన్నీటి నివాళి అర్పిస్తున్నామని పేర్కొన్నారు. నిస్సార్ కుటుంబానికి ఈ సందర్భంగా ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.

More Telugu News