Vijayasai Reddy: హత్యకు గురైన భాస్కరరావు బీసీ కాదా? ప్రతిదానికి కులం కార్డు ఏంటి బాబు?: విజయసాయిరెడ్డి

  • టీడీపీ నాయకుడు అరెస్టైతే చంద్రబాబు రచ్చ చేస్తున్నారు
  • బాబు హయాంలో ప్రతిదీ వ్యాపారమే
  • రివర్స్ టెండర్ల వల్ల ఇప్పుడు అంతా పారదర్శకమే
Vijayasai Reddy fires on Chandrababu

చంద్రబాబు హయాంలో ప్రతిదీ వ్యాపారమేనని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఆరోపించారు. తనకు ఏం వస్తుంది, తన వాళ్లకు ఏం లాభమనేదే ఆయన ఆలోచన అని చెప్పారు. ఆసుపత్రుల్లో శానిటేషన్ కాంట్రాక్టుల నుంచి మందుల సరఫరా వరకు అంతా తన వాళ్లే దోచుకునేలా నిర్ణయాలు ఉండేవని విమర్శించారు. ముఖ్యమంత్రి జగన్ తీసుకొచ్చిన రివర్స్ టెండర్ల విధానం వల్ల ఇప్పుడు అంతా పారదర్శకంగా ఉందని... ప్రతి రూపాయికి లెక్క తెలుస్తోందని అన్నారు.

ప్రభుత్వ ఆసుపత్రులకు తమ ప్రభుత్వం అదనపు బలాన్ని చేకూరుస్తోందని విజయసాయి చెప్పారు. ఒకే నోటిఫికేషన్ ద్వారా 10 వేల వైద్య పోస్టులను భర్తీ చేయనున్నట్టు తెలిపారు. గత ప్రభుత్వాలు నియామకాలను చేపట్టకపోవడంతో... ప్రభుత్వ ఆసుపత్రులు నిర్వీర్యమయ్యాయని... ఇకపై 24 గంటలూ పూర్తి సిబ్బందితో పని చేస్తాయని చెప్పారు.

'మర్డర్ కేసులో ఒక టీడీపీ నాయకుడు అరెస్టైతే బీసీలపై దాడంటూ అర్థ రాత్రి ఫోన్లు చేసి రచ్చ చేస్తున్నాడు నాయుడు బాబు. హత్యకు గురైన భాస్కర రావు బీసీ కాదా? బాధితునికి న్యాయం చేయాలంటూ వేలాది మంది బీసీ మహిళల ధర్నాలు కనిపించడం లేదా? ప్రతిదానికి కులం కార్డు ఏంటి బాబు' అని ట్వీట్ చేశారు.

More Telugu News