UK: మీ ఊబకాయంతోనే ఇంత చిక్కు... దేశవాసులను హెచ్చరించిన యూకే పీఎం బోరిస్ జాన్సన్!

UK Prime Minister Warns People on Obesity
  • ఇతర యూరప్ దేశాలతో పోలిస్తే బ్రిటన్ లో అధిక ఊబకాయులు
  • అందువల్లే కరోనా తీవ్రత అధికంగా ఉంది
  • ప్రజలు పాఠాలు నేర్చుకోవాలన్న బోరిస్ జాన్సన్
బ్రిటన్ వాసుల్లో ఉన్న ఊబకాయం కారణంగానే, కరోనా మహమ్మారి మరింతగా విజృంభించిందని, ప్రజలంతా ఒబేసిటీని తగ్గించుకునే ప్రయత్నాలు చేయాలని, అప్పుడు మరింత సమర్థవంతంగా కరోనాపై పోరాడవచ్చని యూకే ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ వ్యాఖ్యానించారు. తనకు కరోనా సోకిందన్న విషయాన్ని గుర్తు చేసిన ఆయన, తాను ఊబకాయాన్ని తగ్గించుకోవడంతోనే వైరస్ బారి నుంచి బయటపడగలిగానని అన్నారు. జాతిని ఉద్దేశించి తాజాగా ప్రసంగించిన ఆయన, ప్రజలంతా వ్యాయామాలు చేయడం ద్వారా లావు తగ్గాలని సూచించారు.

వైరస్ గణాంకాలు తనకు ఆందోళన కలిగిస్తున్నాయని, ఇతర యూరప్ దేశాలతో పోలిస్తే, బ్రిటన్ వాసులు అధిక ఊబకాయంతో బాధపడుతూ ఉన్నారని గుర్తు చేసిన ఆయన, శరీరం ఫిట్ గా ఉంటే, కొవిడ్ వంటి వైరస్ లతో మరింత బలంగా పోరాడవచ్చని జాన్సన్ వ్యాఖ్యానించారు. ఆ పరిస్థితి వస్తే, దేశం ఆనందంగా ఉంటుందని, దేశ ప్రజల ఆరోగ్యంపై ప్రభుత్వం శ్రద్ధ చూపుతుందని అన్నారు. కాగా, ఇప్పటివరకూ కరోనా కారణంగా యూకే లో 43 వేల మందికి పైగా మరణించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతమున్న పరిస్థితులు దేశానికి కాళరాత్రుల వంటివని, ఈ మహమ్మారిని చూసి ప్రజలు పాఠాలు నేర్చుకోవాలని, కేవలం ప్రభుత్వంపైనే ఆధారపడరాదని అన్నారు.
UK
Britain
Boris Johnson
Obesity

More Telugu News