అర్నాబ్ గోస్వామిపై కేసులను కొట్టివేసిన బాంబే హైకోర్టు

Bombay HC suspends FIRs against Arnab Goswami
  • పాల్ఘర్ లించింగ్, వలస కార్మికులపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కేసు నమోదు
  • అర్నాబ్ విద్వేష వ్యాఖ్యలు చేసినట్టు ఎక్కడా కనిపించలేదన్న ధర్మాసనం
  • తదుపరి ఆదేశాలు వచ్చే వరకు రక్షణ కల్పించాలని ఆదేశం
పాల్ఘర్ మూకదాడి ఘటనతోపాటు వలస కూలీలపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ రిపబ్లిక్ టీవీ ఎడిటర్ అర్నాబ్ గోస్వామిపై నమోదైన రెండు కేసులను బాంబే హైకోర్టు కొట్టివేసింది. పాల్ఘర్ మూకదాడికి సంబంధించి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీపై అర్నాబ్ అనుచిత వ్యాఖ్యలు చేసినట్టు కాంగ్రెస్ శ్రేణులు దేశవ్యాప్తంగా ఆయనపై ఫిర్యాదు చేశాయి. దీంతో అర్నాబ్ తనను అరెస్ట్ చేయకుండా స్టే విధించాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో అన్ని కేసులపైనా స్టే విధించిన సుప్రీంకోర్టు, నాగ్‌పూర్ లో నమోదైన కేసులో మాత్రం స్టే ఇవ్వడానికి నిరాకరించింది. కేసును ముంబైకి బదిలీ చేస్తూ మూడు వారాల పాటు అరెస్ట్ నుంచి రక్షణ కల్పించింది.

లాక్‌డౌన్ సడలింపులు ఇచ్చి సొంతూళ్లకు వెళ్లేందుకు వాహనాలు ఏర్పాటు చేస్తున్నారన్న ప్రచారంతో బాంద్రా రైల్వే స్టేషన్‌కు వలస కూలీలు వేలాది మంది చేరుకోవడం అప్పట్లో సంచలనమైంది. ఈ ఘటనపైనా అర్నాబ్ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఏప్రిల్ 22, మే 2న కేసులు నమోదయ్యాయి.

తాజాగా, ఈ రెండు కేసులను విచారించిన బాంబే హైకోర్టు వాటిని కొట్టివేసింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు అర్నాబ్‌కు రక్షణ కల్పించాలంటూ ఆదేశాలు జారీ చేసింది. నిన్న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేసు విచారణను చేపట్టిన  జస్టిస్ ఉజ్జల్ భూయాన్,  రియాజ్ చాగ్లాతో కూడిన హైకోర్టు ధ‌ర్మాస‌నం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. జర్నలిస్టులకు మతపరమైన ఘటనలను విశ్లేషించే హక్కు ఉందన్న అర్నాబ్ తరపు న్యాయవాదుల వాదనలను అంగీకరించిన కోర్టు.. అర్నాబ్ విద్వేషాలు రెచ్చగొట్టినట్టు ఎక్కడా కనిపించలేదని అభిప్రాయపడింది.
Go Back to Shorts
arnab goswami
Republic TV
Palghar
migrant workers

More Telugu News