Narendra Modi: జూలై నుంచి కరోనా ముప్పు భారీగా ఉంటుంది.. ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది: ప్రధాని మోదీ

Prime Minister Narendra Modi speech on next level unlock
  • అన్ లాక్-1లో నిర్లక్ష్యంగా ఉన్నామని వెల్లడి
  • అందుకే సమస్యలు వచ్చాయన్న మోదీ
  • రాబోయేది పండుగల సీజన్ అంటూ వ్యాఖ్యలు
  • నవంబరు వరకు రేషన్ ఫ్రీ అంటూ ప్రకటన
సుదీర్ఘ లాక్ డౌన్ ను సడలిస్తూ తీసుకువచ్చిన అన్ లాక్-1లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఫలితంగా ఇప్పుడు అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. కరోనా నిబంధనలు పాటించడంలో విఫలమవుతున్నామని అన్నారు. వైరస్ వ్యాప్తికి ప్రజల నిర్లక్ష్యమే ప్రధాన కారణం అని తెలిపారు. జూలై నుంచి కరోనా ముప్పు భారీగా ఉంటుందని, ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిదని స్పష్టం చేశారు.

ఇక లాక్ డౌన్ పరిస్థితుల గురించి మాట్లాడుతూ, లాక్ డౌన్ తో దేశంలోని చాలామంది ఇళ్లలో వంట కూడా చేసుకోలేని పరిస్థితులు ఎదుర్కొన్నారని వెల్లడించారు. అలాంటివాళ్లను కేంద్రం సకాలంలో ఆదుకుందని, అందుకోసమే గరీబ్ కల్యాణ్ యోజన తీసుకువచ్చామని అన్నారు. పేదల కోసం రూ.1.75 లక్షల కోట్ల ప్యాకేజి అమలు చేశామని వివరించారు.

ఇప్పుడు పండుగల సీజన్ వస్తోందని, ప్రజలెవరూ పస్తులు ఉండకూడదన్నది తమ ప్రభుత్వ నిర్ణయం అని మోదీ ఉద్ఘాటించారు. అందుకే దేశంలోని 80 కోట్ల మందికి పైగా నవంబరు వరకు ఉచితంగా రేషన్ సరుకులు అందిస్తామని, అందుకోసం రూ.90 వేల కోట్లు ఖర్చు చేయబోతున్నామని పేర్కొన్నారు. వన్ నేషన్, వన్ రేషన్ కార్డు విధానంలోనే పేదలకు లబ్ది చేకూరుతుందని వివరించారు. ప్రతి నెలా 5 కిలోల బియ్యం, కిలో శనగలు ఇస్తామని చెప్పారు.
Narendra Modi
Unlock 2
India
Corona Virus

More Telugu News