Bihar: వివాహమైన రెండు రోజులకే కరోనాతో పెళ్లికొడుకు మృతి.. పెళ్లికొచ్చిన 95 మందికి కరోనా!

  • బీహార్‌లోని పాలిగంజ్‌లో ఘటన
  • కరోనా బారినపడినా గుర్తించలేకపోయిన వరుడు
  • ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి 
Bride Groom died with corona virus in Bihar

పెళ్లయిన రెండు రోజులకే వరుడు కరోనాతో ప్రాణాలు కోల్పోగా, వివాహానికి హాజరైన వారిలో 95 మందికి కరోనా సోకినట్టు నిర్ధారణ కావడం కలకలం రేపింది. బీహార్‌లోని పాలిగంజ్ పట్టణంలో జరిగిందీ ఘటన. దీహపాలికి గ్రామానికి చెందిన యువకుడు గురుగ్రామ్‌లో (30) సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. పెళ్లి కోసం మే 12న గ్రామానికి చేరుకున్నాడు. ఈ క్రమంలో అతడు కరోనా బారినపడినా గుర్తించలేకపోయాడు. పాలిగంజ్ సమీపంలోని ఓ గ్రామంలో ఈ నెల 15న ఓ యువతిని వివాహం చేసుకున్నాడు.

ఆ తర్వాత రెండు రోజులకే వరుడి ఆరోగ్యం క్షీణించింది. దీంతో పాట్నాలోని ఎయిమ్స్‌కు తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మరణించాడు. అయితే, కరోనా పరీక్షలు చేయించకుండానే వరుడి కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. విషయం తెలిసిన అధికారులు వివాహానికి హాజరైన వారికి కరోనా పరీక్షలు నిర్వహించగా 95 మందికి కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. వధువుకు మాత్రం పరీక్షల్లో నెగటివ్ అని వచ్చినట్టు అధికారులు తెలిపారు. బాధితులందరినీ అధికారులు క్వారంటైన్‌కు తరలించారు. పెళ్లికి 50 మందికి మాత్రమే అనుమతి ఉండగా అంతకుమించి హాజరైనట్టు అధికారులు తెలిపారు.

More Telugu News