Hyderabad: హైదరాబాద్‌లో చెలరేగిపోయిన ఉన్మాది.. ముగ్గురు అక్కలు, బావపై కత్తితో దాడి.. ఇద్దరి మృతి

  • అమ్మకు బాగా లేదని ఇంటికి పిలిచి దారుణం
  • ఇద్దరు అక్కలను పొడిచి మూడో అక్క ఇంటికి వెళ్లిన నిందితుడు
  • ఆమెను పొడిచి నాలుగో సోదరి ఇంటికి..
Brother attacked his sisters with knife two dead

హైదరాబాద్‌లో ఓ ఉన్మాది చెలరేగిపోయాడు. అక్కలను చంపేందుకు ముందుగానే ప్రణాళిక రచించి అమ్మకు బాగాలేదని పిలిచి కత్తితో విచక్షణ రహితంగా దాడి చేశాడు. ఈ ఘటనలో ఇద్దరు అక్కలు ప్రాణాలు కోల్పోగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసుల కథనం ప్రకారం.. చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని సలాలాకు చెందిన అహ్మద్ ఇస్మాయిల్ (27) మాజీ బౌన్సర్. తల్లి పుత్లీబేగంతో కలిసి నివసిస్తున్నాడు. తల్లికి ఆరోగ్యం బాగాలేదని, వెంటనే రావాలని అక్కలకు కబురుపెట్టాడు. నిన్న ఉదయం 11 గంటలకు ఇంటికి వచ్చిన అక్కలు రజియాబేగం, జకీరాబేగంలపై కత్తితో విచక్షణ రహితంగా దాడి చేశాడు.

ఆ తర్వాత అక్కడికి కొంత దూరంలోని నబీల్ కాలనీలో ఉంటున్న మూడో సోదరి నూరాబేగం ఇంటికి వెళ్లి ఆమెపైనా కత్తితో దాడికి దిగాడు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన బావ ఉమర్‌పైనా దాడి చేసి పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికే రజియా బేగం మరణించగా, ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న జకీరాబేగం, నూరాబేగం, ఉమర్‌లను ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే జకీరాబేగం కూడా చనిపోయినట్టు వైద్యులు నిర్ధారించారు. కాగా, గతేడాది మార్చిలోనూ నిందితుడు తన భార్యను గొంతు కోసి చంపినట్టు పోలీసులు తెలిపారు.
 
సలాలకు సమీపంలో ఉన్న ఇస్మాయిల్ నాలుగో సోదరి మల్లికాబేగంను కూడా చంపేందుకు వారింటికి వెళ్లాడు. అయితే, దాడికి గురైన తన సోదరిని ఆసుపత్రిలో చేర్చిన విషయం తెలుసుకున్న ఆమె అప్పటికే ఆసుపత్రికి వెళ్లడంతో బతికిపోయింది. ఇంటి వద్ద ఆమె లేకపోవడంతో ఆసుపత్రికి వెళ్లాడు. అక్కడ పోలీసులను చూసి వెళ్లిపోయాడు. అక్కలు చెప్పిన మాటలు వినే తాను తన భార్యను చంపేశానని, ఇప్పుడు ప్రతీకారంగా వారిని చంపుతున్నట్టు దారిలో కనిపించిన ఓ బంధువుకు ఇస్మాయిల్ చెప్పినట్టు తెలుస్తోంది. కాగా, ఆదివారం ఆస్తి పంపకాల కోసం కుటుంబ సభ్యులు కలుసుకున్నారని, ఆ తర్వాతే నిందితుడు హత్యకు పథకం రచించినట్టు పోలీసులు తెలిపారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నట్టు చెప్పారు.

More Telugu News