Mahesh Babu: లాక్ డౌన్ సడలించినప్పటి నుంచి కరోనా కేసులు పెరిగిపోతున్నాయి: మహేశ్ బాబు

  • కరోనా కేసుల పెరుగుదల పట్ల మహేశ్ ఆందోళన
  • అందరినీ కాపాడుకుందాం అంటూ పిలుపు
  • ఆరోగ్యసేతు యాప్ తప్పనిసరిగా డౌన్ లోడ్ చేసుకోవాలని సూచన
Mahesh Babu concerns over raise in corona cases since lock down eased

  దేశంలో కరోనా అంతకంతకు పెరిగిపోతుండడం పట్ల టాలీవుడ్ అగ్రహీరో మహేశ్ బాబు ఆందోళన వెలిబుచ్చారు. లాక్ డౌన్ సడలించినప్పటి నుంచి కరోనా కేసుల్లో పెరుగుదల కనిపిస్తోందని తెలిపారు. ఈ సమయంలో మనల్ని మనం కాపాడుకోవడమే కాకుండా, మన చుట్టూ ఉన్నవాళ్లను కూడా కాపాడుకుందాం అంటూ పిలుపునిచ్చారు. బయటికి వెళ్లేటప్పుడు తప్పనిసరిగా మాస్కు ధరించాలని స్పష్టం చేశారు. మీ చుట్టుపక్కల పరిస్థితుల పట్ల జాగ్రత్తగా ఉండాలని, భద్రతా చర్యలతో పాటు, భౌతికదూరం కూడా పాటించాలని సూచించారు.

ఇప్పటివరకు మీ ఫోన్ లో ఆరోగ్యసేతు యాప్ లేకపోతే ఇకనైనా డౌన్ లోడ్ చేసుకోవాలని మహేశ్ బాబు పేర్కొన్నారు. మీకు సమీపంలో ఎవరైనా కరోనా నిర్ధారణ అయిన రోగులు ఉన్నట్టయితే ఈ యాప్ మిమ్మల్ని అప్రమత్తం చేస్తుంది అని వెల్లడించారు. అంతేకాదు, ఈ యాప్ తో మీరు అత్యవసర వైద్య సహాయం కూడా అందుకోవచ్చని వివరించారు. మనందరం క్షేమంగా ఉండాలి, ఈ విషయం గుర్తెరిగి బాధ్యతగా మసలుకుందాం అంటూ మహేశ్ బాబు ఇన్ స్టాగ్రామ్ లో స్పందించారు.

More Telugu News