చైనాపై ఆగ్రహాన్ని పనిచేసే సంస్థపై తీర్చుకున్న జొమాటో ఉద్యోగులు!

Zomato Employees Protest and burn Their T Shirts in Kolkata
  • జొమాటోలో చైనా పెట్టుబడులు
  • అటువంటి సంస్థలో ఉద్యోగం వద్దంటూ నిరసన
  • కంపెనీ టీషర్టులు తగులబెట్టిన ఉద్యోగులు
గతవారం ఇండియా, చైనా సరిహద్దుల మధ్య లడఖ్ ప్రాంతంలో జరిగిన ఘటనలు భారత ప్రజలకు తీవ్ర ఆగ్రహాన్ని కలిగించగా, చైనా వస్తువులను బ్యాన్ చేయాలన్న ప్రచారం జోరుగా సాగుతున్న వేళ, జొమాటో ఉద్యోగులు తన కోపాన్ని పనిచేస్తున్న సంస్థపై చూపించారు. చైనాకు చెందిన పెట్టుబడులను కలిగివున్న జొమాటో, ఇండియాలో ఫుడ్ డెలివరీ ప్లాట్ ఫామ్ గా పనిచేస్తూ, దాదాపు అన్ని నగరాల్లో వేలాది మందికి ఉపాధి అవకాశాలను దగ్గర చేసింది. కోల్ కతాలోని కంపెనీ ఉద్యోగులు జొమాటో అఫీషియల్ టీ షర్టులను దగ్ధం చేశారు.

ఈ ఘటన బహాలా ప్రాంతంలో జరిగింది. చైనా పెట్టుబడులతో నడుస్తున్న సంస్థలో తాము పనిచేయబోమంటూ కొందరు ఉద్యోగాలకు రాజీనామా చేశారు కూడా. 2018లో అలీబాబా అనుబంధ సంస్థ యాంట్ ఫైనాన్షియల్, జొమాటోలో 210 మిలియన్ డాలర్లను పెట్టుబడిగా పెట్టి, 14.7 శాతం వాటాను సొంతం చేసుకుంది. ఆపై మరో 150 మిలియన్ డాలర్లను అదనపు పెట్టుబడిగానూ అందించింది.

"చైనా కంపెనీలు ఇండియాలో వ్యాపారం చేస్తూ, లాభాలను గడిస్తున్నాయి. ఇదే సమయంలో సరిహద్దుల్లో మన జవాన్లపై దాడికి వారు వస్తున్నారు. మన భూమిని వారు సొంతం చేసుకోవాలని చూస్తున్నారు. దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సాగనివ్వకూడదు" అని ఓ జొమాటో ఉద్యోగి వ్యాఖ్యానించారు. చైనా ఇన్వెస్ట్ మెంట్ తో నడిచే కంపెనీల్లో పని చేయాలని అనిపించడం లేదని మరో నిరసనకారుడు వ్యాఖ్యానించారు.

కాగా, గత నెలలో లాక్ డౌన్ కారణంగా వ్యాపారం నిలిచిపోవడంతో, మొత్తం ఉద్యోగుల్లో 13 శాతానికి సమానమైన 520 మందిని జొమాటో తొలగించింది. తాజాగా నిరసనలు చేపట్టిన వారు గతంలో తొలగించిన ఉద్యోగులా? అన్న విషయమై స్పష్టత లేదు. ఈ విషయమై జొమాటోను వివరణ కోరగా ఎటువంటి స్పందనా రాలేదు.
Go Back to Shorts
Zomato
Protest
Kolkata

More Telugu News