Corona Virus: కరోనా మహోగ్రరూపం... ఆరు నెలలు, 213 దేశాలు, కోటి కేసులు!

  • శనివారం రాత్రితో కోటి దాటిన కేసులు
  • దాదాపు 5 లక్షల మంది మృతి
  • అంతకంతకూ విస్తరిస్తున్న మహమ్మారి
One Crore Corona Cases in World

చైనాలోని వూహాన్ లో పుట్టి, ఆపై 213 దేశాలకు విస్తరించిన మహమ్మారి కరోనా, ఇప్పుడు కోటి మందిని పట్టేసింది. తొలి కేసు వచ్చిన ఆరు నెలల తరవాత కేసుల సంఖ్య కోటికి చేరగా, దాదాపు 5 లక్షల మంది వరకూ మరణించారు. గత సంవత్సరం డిసెంబర్ 16న సార్స్ తరహా కొత్త వైరస్ వెలుగులోకి వచ్చిందని తెలిసిన వేళ, ఏదో మామూలు వైరస్ అనుకున్నారే తప్ప, కరోనా ఉగ్రరూపాన్ని అప్పుడెవరూ ఊహించలేదు. ఆపై వైరస్ అంతకంతకూ పెరిగి, ఐరోపా దేశాల మీదుగా అమెరికాలోకి ప్రవేశించింది. యూరప్ లోని ఇటలీ, యూకే, స్పెయిన్ తదితర దేశాలు ఈ వైరస్ కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. కొన్ని దేశాలు ఇప్పుడిప్పుడే కోలుకుంటుండగా, అమెరికాను ఇంకా మహమ్మారి వదిలి పెట్టలేదు.

శనివారం రాత్రికి వరల్డ్ వైడ్ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,00,00481కి చేరింది. ఇదే సమయంలో మరణాల సంఖ్య 4,98,952కు చేరుకున్నాయి. ఇక అమెరికాలో సగటున రోజుకు 40 వేల మందికి వ్యాధి సోకుతుండగా, ఇండియా సహా బ్రెజిల్, రష్యా, మెక్సికో, ఇరాన్, బంగ్లాదేశ్, చిలీ, పెరూ, పాకిస్థాన్ తదితర దేశాల్లో వైరస్ ఉనికి ప్రమాదకరంగా ఉంది. వైరస్ నుంచి దాదాపు బయటపడిందని భావించిన చైనాను ఇప్పుడు సెకండ్ వేవ్‌ ఆందోళనకు గురి చేస్తోంది.

ఇక గడచిన వారం రోజుల వ్యవధిలో ప్రపంచవ్యాప్తంగా రోజుకు సగటున 1.60 లక్షలకు పైగా కేసులు నమోదు అవుతున్నాయి. ఈనెల 20న 1.57 లక్షలు, 21న 1.30 లక్షలు, 22న 1.39 లక్షలు, 23న 1.64 లక్షలు, 24న 1.73 లక్షలు, 25న 1.80 లక్షలు, 25న 1.94 లక్షల కేసులు నమోదయ్యాయి. కరోనా సోకి మరణించిన వారి సంఖ్యలో అమెరికా తొలి స్థానంలో ఉంది. యూఎస్ లో ఇప్పటికే 1,27,830 మంది ఈ మహమ్మారి బారిన పడి మరణించారు. ఆ తరువాత బ్రెజిల్ లో 56 వేల మందికి పైగా, యూకేలో 43 వేల మందికి పైగా, ఇటలీలో 34 వేల మందికి పైగా మరణించారు.

More Telugu News