JP Nadda: రాజీవ్ గాంధీ ఫౌండేషన్ కు చైనా ఎంబసీ నుంచి నిధులు అందాయి... ఇది దేనికి సంకేతం?: జేపీ నడ్డా

  • లగ్జెంబర్గ్ వంటి దేశాల నుంచి విరాళాలు వచ్చాయని ఆరోపణ
  • సోనియా జవాబు చెప్పాల్సిందేనన్న నడ్డా
  • క్విడ్ ప్రో కోకు పాల్పడ్డారా? అంటూ నిలదీసిన బీజేపీ చీఫ్
JP Nadda slams Congress party leaders

పీఎం కేర్స్ ఫండ్స్ పై విమర్శలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీపై బీజేపీ ఎదురుదాడి చేస్తోంది. తాజాగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కాంగ్రెస్ అధినాయకత్వంపై ధ్వజమెత్తారు. రాజీవ్ గాంధీ ఫౌండేషన్ కు చైనా దౌత్య కార్యాలయం నుంచి 2005-2009 మధ్యకాలంలో నిధులు అందాయని ఆరోపించారు. పన్నులు అతి స్వల్పంగా వుండే లగ్జెంబర్గ్ దేశాల నుంచి 2006-2009 మధ్య కాలంలో ప్రతి ఏడాది విరాళాలు వచ్చాయని అన్నారు. ఇవి దేనికి సంకేతం అని నిలదీశారు.

తీవ్ర వాణిజ్య ప్రయోజనాలతో ముడిపడి ఉన్న ఎన్జీవోలు, పలు కంపెనీల నుంచే రాజీవ్ గాంధీ ఫౌండేషన్ కు విరాళాలు అందాయని తెలిపారు. చైనా వ్యవహారం, కరోనా సంక్షోభం వంటి అంశాల మాటున ఇలాంటి ప్రశ్నలకు జవాబులు చెప్పకుండా సోనియా గాంధీ తప్పించుకోజాలరని, దేశం సమాధానాలు కోరుతోందని అన్నారు.

చైనాతో భారత్ వాణిజ్య లోటు 2004లో 1.1 బిలియన్ డాలర్లుగా ఉందని, కానీ 2013-14 నాటికి అది 36.2 బిలియన్ డాలర్లకు చేరిందని, కాంగ్రెస్ నుంచి క్విడ్ ప్రో కో వంటిదేమైనా జరిగిందా? అంటూ జేపీ నడ్డా సూటిగా ప్రశ్నించారు.

More Telugu News