Chandrababu: అచ్చెన్నాయుడి ప్రాణాలతో చెలగాటం ఆడే కుట్రలు చేస్తోందీ ప్రభుత్వం: చంద్రబాబు

  • అచ్చెన్నను అర్ధరాత్రి డిశ్చార్జి చేయాలని చూడడం ఏంటన్న చంద్రబాబు
  • అసలీ అర్ధరాత్రి కుట్రలేంటని ఆగ్రహం
  • అమానుషంగా ప్రవర్తిస్తే సహించేది లేదని హెచ్చరిక
Chandrababu questions YSRCP government on Atchannaidu issue

మాజీ మంత్రి అచ్చెన్నాయుడు వ్యవహారంలో హైడ్రామా చోటుచేసుకోవడం పట్ల టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఘాటుగా స్పందించారు. అచ్చెన్నాయుడి ప్రాణాలతో చెలగాటం ఆడే కుట్రలు చేస్తోందంటూ వైసీపీ సర్కారుపై మండిపడ్డారు. అరెస్ట్ చేసే ముందు రోజే ఆయనకు శస్త్రచికిత్స జరిగిందని, తనకు శస్త్రచికిత్స జరిగిందని అచ్చెన్న చెప్పినా వినకుండా అధికారులు ఆయనను వందల కిలోమీటర్లు రోడ్లపై వాహనంలో తిప్పారని ఆరోపించారు. దాంతో గాయం తిరగబెట్టి రెండోసారి శస్త్రచికిత్స చేయాల్సి వచ్చిందని తెలిపారు.

అచ్చెన్నాయుడిని ఆసుపత్రి బెడ్ పైనే ప్రశ్నించాలని ఏసీబీ కోర్టు చెప్పిందని, ఆయనను నిలబెట్టరాదని, కూర్చోబెట్టరాదని కూడా కోర్టు సూచించిందని చంద్రబాబు వెల్లడించారు. కనీసం 10 రోజులు బెడ్ రెస్ట్ ఇవ్వాలని వైద్యులు చెబితే, గుంటూరు ప్రభుత్వాసుపత్రి వైద్యులపై ఒత్తిడి తీసుకువచ్చి అర్ధరాత్రి డిశ్చార్జి చేయాలని చూడడం ఏంటని ప్రశ్నించారు. ఏసీబీ అధికారులు కూడా అచ్చెన్నను అర్ధరాత్రే అదుపులోకి తీసుకోవాలని చూడడం ఏంటి? అసలీ అర్ధరాత్రి కుట్రలేంటని నిలదీశారు.

న్యాయస్థానం ఆదేశాలను సైతం ధిక్కరిస్తూ ఆసుపత్రి వర్గాలపై తీవ్ర ఒత్తిళ్లు తెస్తున్నారని మండిపడ్డారు. ఇది కేసు విచారణలా లేదని, బీసీ నేతపై హత్యాయత్నంలా ఉందని ప్రజాసంఘాలే అంటున్నాయని చంద్రబాబు ట్విట్టర్ లో వ్యాఖ్యానించారు. ఈ కేసులో చూపుతున్న అత్యుత్సాహం వైసీపీ భూదందాలపైనా, 108 కుంభకోణంపైనా, ఆవ భూముల స్కాంపైనా, ఇసుక మాఫియాపైనా ఎందుకు చూపడంలేదని ప్రశ్నించారు.

కొందరు పోలీసు అధికారుల విపరీత ప్రవర్తన వల్లే ఉన్నతాధికారులు కోర్టుల ముందు నిలబడాల్సిన పరిస్థితి వస్తోందని కోర్టులు నిన్ననే ఆక్షేపించాయని పేర్కొన్నారు. అధికారం చేతిలో ఉంది కదా అని బీసీ నేత అచ్చెన్నాయుడు విషయంలో అమానుషంగా ప్రవర్తిస్తే సహించేది లేదని చంద్రబాబు హెచ్చరించారు. న్యాయపరంగా పోరాడి వైసీపీ ప్రభుత్వ కుట్రలను అడ్డుకుంటామని స్పష్టం చేశారు.

More Telugu News