Manipur: ఫలించిన అమిత్ షా మంత్రాంగం... మణిపూర్ బీజేపీ చేతుల్లోనే!

  • వెనక్కు వచ్చేసిన ఎన్పీపీ రెబల్ ఎమ్మెల్యే
  • డిప్యూటీ సీఎంతో కలిసి ఢిల్లీలో మంతనాలు
  • మద్దతు కొనసాగించాలని నిర్ణయం
  • ట్విట్టర్ లో వెల్లడించిన హిమాంత బిశ్వ శర్మ
BJP Retains Manipur

బీజేపీ నేత అమిత్ షా మంత్రాంగం ఫలించింది. మణిపూర్ లో ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటున్నట్టు చెప్పిన ఎమ్మెల్యేలు యూ టర్న్ తీసుకున్నారు. రెండు రోజుల క్రితం ప్రభుత్వం కూలిపోయే పరిస్థితి ఏర్పడగా, ఆ వెంటనే రంగంలోకి దిగిన అమిత్ షా, నడ్డా, పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేశారు. వారి ప్రయత్నాలు ఫలించాయి. ఎన్పీపీ రెబల్ ఎమ్మెల్యేలు అమిత్ షాతో సమావేశమయ్యారు. ఆపై మేఘాలయా ముఖ్యమంత్రి కోర్నాడ్ సంగ్మా నేతృత్వంలోని నేషనల్ పీపుల్స్ పార్టీ, మణిపూర్ లో బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వానికి మద్దతును కొనసాగించాలని నిర్ణయించిందని హిమాంత బిశ్వ శర్మ తన ట్విట్టర్ ఖాతాలో గత రాత్రి వెల్లడించారు.

"కోర్నాడ్ సంగ్మా నేతృత్వంలోని ఎన్పీపీ బృందం మణిపూర్ డిప్యూటీ సీఎం వై జాయ్ కుమార్ తో కలిసి న్యూఢిల్లీలో బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిశారు. మణిపూర్ లో ప్రభుత్వానికి ఇబ్బందులు లేవు, రాష్ట్ర అభివృద్ధి కోసం ఎన్పీపీ తమ మద్దతును కొనసాగిస్తుంది" అని హిమాంత తెలియజేశారు.

కాగా, తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ప్రభుత్వం నుంచి వైదొలగుతున్నామని ప్రకటించడంతో బీరేన్ సింగ్ ప్రభుత్వం మైనారిటీలో పడిపోయిన సంగతి తెలిసిందే. బీజేపీకి చెందిన ముగ్గురితో పాటు, ఎన్పీపీకి చెందిన నలుగురు, బయట నుంచి మద్దతిస్తున్న ఒక తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే, మరో స్వతంత్ర ఎమ్మెల్యే మద్దతును ఉపసంహరించుకుంటున్నట్టు ఈ వారం ప్రారంభంలో ప్రకటించి షాక్ ఇచ్చారు. దీంతో ప్రభుత్వం పడిపోయే పరిస్థితి ఏర్పడగా, బీజేపీ అధినాయకత్వం స్పందించి, పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నాలు చేసి విజయవంతమైంది.

More Telugu News