C-Voter: మనకు పాకిస్థాన్ కన్నా చైనాతోనే అధిక ప్రమాదం... అత్యధికుల అభిప్రాయమిదే!

  • చైనాతోనే ప్రమాదమన్న 68 శాతం
  • బీజేపీపై 73.6 శాతం మందికి నమ్మకం
  • ప్రధానిగా నరేంద్ర మోదీ వైపు మొగ్గు
  • సర్వే వివరాలు వెల్లడించిన సీ-ఓటర్
C Voter Survey Says China Is A Bigger Problem To India

సరిహద్దుల్లో చైనాతో ఉద్రిక్తతలు పెరిగిన వేళ, దేశవ్యాప్తంగా చైనా వస్తువులను బ్యాన్ చేయాలంటూ పలువురు డిమాండ్ చేస్తుండగా, పాకిస్థాన్ తో పోలిస్తే, చైనాతోనే ఇండియాకు అధిక ప్రమాదం పొంచివుందని అత్యధిక శాతం భారతీయులు అభిప్రాయపడుతున్నారు. సీ ఓటర్ సంస్థ దేశవ్యాప్తంగా ఓ సర్వే నిర్వహించి ఈ విషయాన్ని వెల్లడించింది. సర్వేలో పాల్గొన్న వారిలో 68 శాతం మంది చైనాతోనే ప్రమాదమని చెప్పగా, 32 శాతం మంది పాకిస్థాన్ కారణంగా కలిగే ప్రమాదం అధికమని పేర్కొన్నారు.

ఇక, సరిహద్దుల్లో భారత సైనికులపై చైనా చేసిన దాడి తరువాత ఇండియా దీటైన సమాధానాన్ని ఇస్తుందా? అన్న ప్రశ్నకు 'యస్' అని 39 శాతం మంది మాత్రమే వెల్లడించడం గమనార్హం. గాల్వాన్ పై చైనా సైనికులు జరిపిన దాడికి నరేంద్ర మోదీ ప్రభుత్వం తగు రీతిలో సమాధానం ఇస్తుందని వారు చెప్పగా, మిగతావారు మాత్రం అటువంటి సమాధానాన్ని ఊహించలేమని పేర్కొన్నారు.

సర్వేలో పాల్గొన్న వారిలో 73.6 శాతం మంది బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేపైనా, ప్రధాని నరేంద్ర మోదీపైనా నమ్మకం ఉందని వెల్లడించారు. కేవలం 16.7 శాతం మంది మాత్రమే విపక్షంపై నమ్మకాన్ని చూపించగా, మరో 9.6 శాతం మంది ఎవరిపైనా నమ్మకం లేదని చెప్పారు. మోదీ, రాహుల్ గాంధీల్లో ఎవరు ప్రధానిగా ఉంటే బాగుంటుందని కోరుకుంటున్నారన్న ప్రశ్నకు నరేంద్ర మోదీవైపే ఎక్కువ మంది మొగ్గుచూపారు. 72.6 శాతం మంది మోదీయే ప్రధానిగా ఉండాలని కోరగా, 14.4 శాతం మంది రాహుల్ వైపు మొగ్గు చూపారు.

చైనా ఉత్పత్తులను నిషేధించేలా నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని, ప్రభుత్వం ఈ దిశగా అడుగులు వేస్తుందని భావిస్తున్నామని 68 శాతం మంది వెల్లడించగా, 31 శాతం మంది మాత్రం చైనా వస్తువులను కొనేందుకు సిద్ధమేనని వెల్లడించడం గమనార్హం.

More Telugu News