Pattiseema Project: పట్టిసీమ పంపులు పీకుతామన్నారు.. మీరు అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తైంది: దేవినేని ఉమా

  • పట్టిసీమను వట్టిసీమ అని జగన్ అన్నారు
  • గోదావరి జలాలను తీసుకుపోతున్నారంటూ రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు
  • ఆరో ఏడాది కూడా గోదావరి జలాలు వచ్చేశాయి
Jagan criticised Pattiseema as Vattiseema says Devineni Uma

వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ మండిపడ్డారు. పట్టిసీమ ప్రాజెక్టును వైసీపీ గతంలో అడ్డుకునేందుకు ప్రయత్నించిందని అన్నారు. పట్టిసీమను వట్టిసీమ అంటూ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు జగన్ విమర్శించారని... గోదావరి జలాలను తీసుకుపోతున్నారంటూ డెల్టా ప్రాంత ప్రజలపై విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. గోదావరి జిల్లాల్లో తమ దిష్టిబొమ్మలను కూడా దగ్దం చేయించారని విమర్శించారు.

అధికారంలోకి వస్తే పట్టిసీమ పంపులు పీకుతామంటూ గతంలో జగన్ అన్నారని... మీరు అధికారంలోకి వచ్చే ఏడాది దాటిందని, నాటి మీ మాటలకు ఇప్పుడు ప్రజలకు ఏం సమాధానం చెపుతారని ప్రశ్నించారు. తమ నాయకుడు చంద్రబాబు ముందు చూపుతో కట్టిన పట్టిసీమ ద్వారా ఆరో సంవత్సరం కూడా కృష్ణా డెల్టాను కాపాడేందుకు గోదావరి జలాలు వచ్చేశాయని అన్నారు. ఈ సందర్భంగా గోదావరి జలాలకు ఆయన పూజలు చేశారు.

More Telugu News