Sajjala Ramakrishna Reddy: చంద్రబాబు వ్యక్తిత్వం ఎలాంటిదో ఈ విషయంలో స్పష్టమవుతోంది: సజ్జల రామకృష్ణారెడ్డి

  • చంద్రబాబు నాటకాలు బయటపడ్డాయన్న సజ్జల
  • వైజాగ్ వెళుతున్నానంటూ ఎంతో హడావుడి చేశారని వెల్లడి
  • అచ్చెన్న కోసం పరుగులు తీశారని విమర్శలు
Sajjala Ramakrishnareddy comments on Chandrababu

టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుపై రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ధ్వజమెత్తారు. వైజాగ్ గ్యాస్ లీక్ బాధితుల పరామర్శ విషయంలో చంద్రబాబు ఆడిన నాటకాలన్నీ బయటపడ్డాయని విమర్శించారు.

వైజాగ్ వెళ్లేందుకు కేంద్ర హోంశాఖ అనుమతి తీసుకుంటున్నానని, ప్రత్యేక విమానంలో పరామర్శకు వెళుతున్నానని ఎంతో హడావుడి చేశారని, చివరికి ఆ విమానం ఏమయ్యిందో తెలియదని సజ్జల వ్యంగ్యం ప్రదర్శించారు. ఇటీవల కూడా తాను వైజాగ్ వెళతానంటే ఉద్దేశపూర్వకంగా విమానాలు రద్దు చేశారంటూ రాష్ట్ర ప్రభుత్వంపైనా, సీఎం జగన్ పైనా అభాండాలు వేశారని తెలిపారు.

చంద్రబాబు అదే రోజున ఉండవల్లి కరకట్టలోని తన నివాసానికి వచ్చారు కానీ వైజాగ్ వెళ్లలేదని సజ్జల ఆరోపించారు. అయితే, అవినీతి కేసులో అచ్చెన్నాయుడు అరెస్ట్ అయిన విషయం తెలియగానే హైదరాబాద్ నుంచి ఆగమేఘాల మీద గుంటూరు వచ్చారని విమర్శించారు. ఇదే ఆదుర్దా వైజాగ్ గ్యాస్ బాధితుల విషయంలో ఎందుకు చూపలేదని ప్రశ్నించారు. చంద్రబాబు వ్యక్తిత్వం ఎలాంటిదో ఈ విషయం ద్వారా స్పష్టమవుతోందని ట్విట్టర్ లో స్పందించారు.

More Telugu News