Chandrababu: జగన్ శాడిజానికి ఇది పరాకాష్ఠ: నిప్పులు చెరిగిన చంద్రబాబు

  • మచ్చలేని కుటుంబం అచ్చెన్నాయుడిది
  • చట్ట విరుద్ధంగా అరెస్ట్ చేశారు
  • ఇది కక్షపూరిత చర్యేనన్న చంద్రబాబు
Chandrababu Fires on Jagan

తన పార్టీ నేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడి అరెస్ట్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లోని శాడిజానికి పరాకాష్ఠని చంద్రబాబు అభివర్ణించారు. ఓ ప్రజా ప్రతినిధిని అరెస్ట్ చేయాల్సిన అవసరం ప్రభుత్వానికి ఏంటని ఆయన ప్రశ్నించారు. ఈ ఉదయం తెలుగుదేశం పార్టీ నేతలతో టెలీ కాన్ఫరెన్స్ లో మాట్లాడిన ఆయన, జగన్ పై నిప్పులు చెరిగారు. ఆయన ప్రస్తుతం ఎక్కడున్నారో తక్షణం తెలియజేయాలని డిమాండ్ చేశారు.

 బలహీన వర్గాలను అణచి వేయడమే లక్ష్యంగా జగన్ దుర్మార్గాలకు పాల్పడుతున్నారని, ఆయన ప్రోద్బలంతోనే ఏసీబీ దాడులు జరిగాయని చంద్రబాబు ఆరోపించారు. చట్ట విరుద్ధంగా అచ్చెన్నాయుడిని అదుపులోకి తీసుకున్నారని, గత 38 సంవత్సరాలుగా ఆయన తనకు తెలుసునని, వారిది మచ్చలేని కుటుంబమని చంద్రబాబు వ్యాఖ్యానించారు. అచ్చెన్నాయుడికి ఏదైనా హాని జరిగితే, ప్రభుత్వానిదే బాధ్యతని హెచ్చరించారు. ఇది కచ్చితంగా కక్షపూరిత చర్యేనని, లాక్ డౌన్ అమలులో ఉన్న సమయంలో, వందలాది మంది పోలీసులను పంపించి, ఈ తరహాలో అరెస్ట్ కు పాల్పడటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు.

More Telugu News