IPL: సెప్టెంబరు-అక్టోబరులో ఐపీఎల్..? ఐసీసీ ప్రకటన కోసం వేచిచూస్తున్న బీసీసీఐ

  • లాక్ డౌన్ కారణంగా ఐపీఎల్ నిరవధిక వాయిదా
  • ఆస్ట్రేలియాలో జరగాల్సిన టి20 వరల్డ్ కప్ పై నిర్ణయం తీసుకోనున్న ఐసీసీ
  • వరల్డ్ కప్ వాయిదా పడితే ఆ ఖాళీ సమయంలో ఐపీఎల్ నిర్వహణ
 BCCI awaits ICC decision on T20 world cup

కరోనా మహమ్మారి స్వైరవిహారం చేస్తుండడంతో భారత్ లో ఐపీఎల్ పోటీలకు పెనువిఘాతం ఏర్పడింది. ఓవైపు నిత్యం వేలల్లో కరోనా కేసులు, మరోవైపు లాక్ డౌన్ ను వరుసగా పొడిగిస్తున్న కేంద్రం... ఇలాంటి పరిస్థితుల్లో ఏంచేయాలో పాలుపోక ఐపీఎల్ నిరవధికంగా వాయిదా వేశారు. అయితే, ఈ ఏడాది ఆస్ట్రేలియాలో టి20 వరల్డ్ కప్ అక్టోబరు 18 నుంచి నవంబరు 15 వరకు జరగాల్సి ఉంది. ఈ టోర్నీ గనుక వాయిదా పడితే ఆ సమయంలో ఐపీఎల్ నిర్వహించాలని బీసీసీఐ తలపోస్తోంది. ఈ మేరకు ఓ ప్రణాళిక కూడా సిద్ధం చేసుకుంది.

దీనిపై ఐపీఎల్ పాలకమండలి చైర్మన్ బ్రిజేశ్ పటేల్ మాట్లాడుతూ, టి20 వరల్డ్ కప్ టోర్నీ నిర్వహణపై ఐసీసీ చేసే ప్రకటన కోసం వేచి చూస్తున్నామని, ఈ విషయంలో ఐసీసీ నుంచి స్పష్టత వస్తే ఐపీఎల్ తేదీలు ప్రకటిస్తామని వెల్లడించారు. టి20 టోర్నీని రద్దు చేస్తున్నట్టు ఐసీసీ ప్రకటిస్తే, ఆపై తాము ఐపీఎల్ షెడ్యూల్ రూపొందిస్తామని, తమ వరకు సెప్టెంబరు-అక్టోబరు మాసాల్లో ఐపీఎల్ నిర్వహించాలని భావిస్తున్నట్టు తెలిపారు. కాగా టి20 వరల్డ్ కప్ పై నిర్ణయం తీసుకునేందుకు ఐసీసీ జూన్ 14న సమావేశం కానుంది.

More Telugu News