Asaduddin Owaisi: కరోనా నుంచి కాపాడతాడని మోదీపై భారం వేస్తే అంతేసంగతులు!: అసదుద్దీన్ ఒవైసీ

  • చప్పట్లు, దీపాలతో కరోనా పోదంటూ వ్యంగ్యం
  • దేశాన్ని సవారీకి తీసుకెళ్లారని విమర్శలు
  • కరోనా అంశంలో కేంద్రం ఏమీ చేయలేకపోయిందని వ్యాఖ్యలు
Asaduddin Owaisi take a dig at PM Modi

ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ప్రధాని నరేంద్ర మోదీపై ధ్వజమెత్తారు. కరోనా నేపథ్యంలో మోదీ దేశాన్ని సవారీకి తీసుకెళ్లినట్టుందని, కానీ ఈ మహమ్మారి వైరస్ ను నియంత్రించడంలో మోదీ పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. కరోనా వైరస్ బారి నుంచి కాపాడతారని మోదీపై భారం వేస్తే అంతేసంగతులని అన్నారు. చప్పట్లు కొట్టడం, దీపాలు వెలిగించడం ద్వారా కరోనా వ్యాప్తి ఆగదని వ్యాఖ్యానించారు. మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం కరోనా విషయంలో ఏమీ చేయలేకపోయిందని స్పష్టం చేశారు.

"లాక్ డౌన్ అనేది అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయం మాత్రమే. అదేమీ ఎంతో ప్రణాళికబద్ధంగా తీసుకున్న నిర్ణయం కాదు. అది కూడా దేశంలో సుమారు 500 మంది కరోనా పాజిటివ్ వ్యక్తులు ఉన్న సమయంలో లాక్ డౌన్ విధించారు. కానీ ఇప్పుడు లక్షల మంది కరోనా బారినపడ్డారు. ఇప్పుడు కోట్లమంది వలసజీవులు స్వస్థలాలకు వెళ్లిన తర్వాత లాక్ డౌన్ ఎత్తేస్తున్నారు. రైళ్లలో 85 మంది వలస కార్మికుల మరణాలకు ఎవరు బాధ్యత వహిస్తారు? నిన్న కూడా ఓ జర్నలిస్టు మరణించాడు. వాళ్ల గురించి మాట్లాడేవాళ్లెవ్వరు? ఈ ప్రభుత్వం ఎంతసేపూ ఓ ఏనుగు గురించే మాట్లాడుతుంది. ఈ ప్రభుత్వం దృష్టంతా పతాక శీర్షికల్లో ఉండడం ఎలా అన్నదానిపైనే" అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

More Telugu News