Rain: హైదరాబాద్ ను కమ్మేసిన క్యుములో నింబస్... రాత్రంతా పలు ప్రాంతాలలో వర్షం!

  • 9 గంటలకు మొదలైన వర్షం
  • పలు ప్రాంతాలను దాటుతూ వెళ్లిన మేఘాలు
  • రాత్రంతా కనిపించిన ఉరుములు, మెరుపులు
Whole Night Rain in Hyderabad

హైదరాబాద్ నగరాన్ని బలమైన క్యుములో నింబస్ మేఘాలు వీడలేదు. గత రాత్రి 9 గంటల నుంచి ప్రారంభమైన వర్షం ఎక్కడో ఒకచోట కురుస్తూనే ఉండటం గమనార్హం. రాత్రి 9 గంటలకు హయత్ నగర్ ఉప్పల్ సమీపంలో ఈ మేఘాల కారణంగా మొదలైన వర్షం ఆపై ఎల్బీనగర్, దిల్ సుఖ్ నగర్, మల్కాజ్ గిరి, మలక్ పేట లకు విస్తరించింది.

ఆపై 10 గంటల ప్రాంతంలో ఖైరతాబాద్, మెహిదీపట్నం, కూకట్ పల్లి ప్రాంతాలకు వ్యాపించి, మాదాపూర్, శంషాబాద్ మీదుగా మేఘాలు విస్తరించాయి. రాత్రి ఒంటిగంట సమయంలో శేరిలింగంపల్లి ప్రాంతాన్ని వాన ముంచెత్తింది. మూడు గంటల ప్రాంతంలోనూ కొన్ని చోట్ల వర్షాలు కురిశాయి. ఆపై తెల్లవారుజామున రంగారెడ్డి, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో వర్షాలు కురిశాయి. రాత్రంతా ఉరుములు, మెరుపులు కనిపిస్తూనే ఉన్నాయి.

ఈ వర్షాల ప్రభావం మరికొన్ని రోజులు ఉంటుందని, నైరుతీ రుతుపవనాలు ఈ మేఘాలకు జత కలవనుండటంతో మరిన్ని వర్షాలకు అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ హెచ్చరికల కేంద్రం అధికారులు వెల్లడించారు. మరోవైపు అరేబియా సముద్రంలో ఏర్పడిన నిసర్గ్ ప్రభావం కూడా తెలంగాణపై కనిపిస్తుందని, తుపాను తీరం దాటిన తరువాత తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు.

More Telugu News