Dead Bodies: బావిలో లభ్యమైన మృతదేహాలకు శవపరీక్ష.... ఈడ్చుకొచ్చి బావిలో పడేసినట్టు అనుమానాలు!

  • పాడుబడ్డ బావిలో 9 మృతదేహాలు
  • ఎంజీఎం ఆసుపత్రిలో శవపరీక్ష పూర్తి
  • మృతదేహాలపై ఈడ్చుకొచ్చిన ఆనవాళ్లు!
Autopsy completed in Waranagal dead bodies case

వరంగల్ శివారు ప్రాంతం గీసుకొండలో ఓ పాడుబడ్డ బావిలో 9 మంది శవాలుగా తేలిన ఘటన సంచలనం సృష్టించింది. ఈ మృతదేహాలకు వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో శవపరీక్ష నిర్వహించారు. ఏడుగురు వ్యక్తులు నీట మునిగి మరణించినట్టు రిపోర్టులో తేలింది. మరో ఇద్దరిలో మాత్రం ఊపిరితిత్తుల్లో నీళ్లు కనిపించకపోవడం అనుమానాలకు తావిస్తోంది.

ఈ సందర్భంగా పోలీసుల వ్యాఖ్యలు మరింత ఆసక్తిగొలుపుతున్నాయి. వారు మత్తులో ఉన్నప్పుడు ఈడ్చుకొచ్చి పడేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. దేహాలను ఈడ్చినప్పుడు వారి శరీరంపై ఆ మేరకు ఆనవాళ్లు కనిపించినట్టు రిపోర్టులో పేర్కొనడం పోలీసుల అనుమానాలకు బలం చేకూర్చుతోంది.

మరో రెండు ఫోరెన్సిక్ నివేదికలు వస్తే కేసు దర్యాప్తులో మరింత స్పష్టత వచ్చే అవకాశముందని పోలీసులు తెలిపారు. అంతేకాకుండా, మూడు సెల్ ఫోన్లలోని కాల్ డేటాను కూడా పరిశీలిస్తున్న పోలీసులు కీలక సమాచారం ఏమైనా లభ్యమవుతుందేమోనని ఆశిస్తున్నారు. మొత్తమ్మీద, వారిని బావిలోకి నెట్టి చంపారా అనే కోణంలోనూ పోలీసులు ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. కాగా, ఆ బావిలో నీటిని మొత్తం బయటికి తోడించిన పోలీసులు, బావిలోకి దిగి ఆధారాలు సేకరించనున్నారు.

More Telugu News