Flight crash: కరాచీ విమాన ప్రమాదం.. మేడే, మేడే.. పైలట్ చివరి మాటలు ఇవే!

  • పైలట్, ఏటీసీ కాక్‌పిట్ సంభాషణ వెలుగులోకి
  • రెండు రన్‌వేలు సిద్ధంగా ఉన్నాయని చెప్పిన ఏటీసీ 
  • ఆకాశంలోనే ఉండడం సురక్షితమని భావించిన పైలట్
  • ఏటీసీతో సంబంధాలు తెగిన కాసేపటికే కూలిన విమానం
Pakistan Flight Carsh cockpit audio in flight tracking website

పాకిస్థాన్‌లో నిన్న జరిగిన విమాన ప్రమాదానికి ముందు తాము ఆపదలో ఉన్నామంటూ పైలట్ పంపిన హెచ్చరికలకు సంబంధించిన కాక్‌పిట్ సంభాషణ వెలుగులోకి వచ్చింది. విమానం క్రాష్ కావడానికి ముందు పైలట్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) మధ్య జరిగిన సంభాషణ ఫ్లైట్ ట్రాకింగ్ వెబ్‌సైట్ ‘లైవ్ఏటీసీ.నెట్’లో ప్రత్యక్షమైంది. ఆ సంభాషణ ప్రకారం.. తాము ప్రమాదంలో ఉన్నామని చెప్పేందుకు ‘మేడే, మేడే, మేడే’ అనే సందేశాన్ని పైలట్ ఏటీసీకి పంపాడు. ఆ వెంటనే రాడార్‌తో సంబంధాలు తెగిపోయి విమానం కూలిపోయింది.

తొలుత పైలట్ విమానం అప్రోచ్ అవుతున్నట్టు ఏటీసీకి తెలిపాడు. అందుకు ఏటీసీ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. దీంతో మేం ఎడమవైపునకు తిరగాలా? అని పైలట్ మళ్లీ ప్రశ్నించాడు.  దీనికి ఏటీసీ నుంచి 'అవును' అని గ్రీన్ సిగ్నల్ వచ్చింది. అయితే, విమానం రెండు ఇంజిన్లు దెబ్బతిన్నాయని, తాము నేరుగా వెళ్తున్నామని పైలట్ మళ్లీ చెప్పాడు. దీంతో స్పందించిన ఏటీసీ బెల్లీ ల్యాండింగ్‌కు కనుక సిద్ధపడితే కన్ఫామ్ చేయాలని కోరింది.

అంతేకాదు, ల్యాండింగ్‌కు 2, 5 రన్‌వేలు సిద్ధంగా ఉన్నాయని చెప్పింది. అర్థం కావడం లేదని చెప్పిన పైలట్.. ‘మేడే, మేడే, మేడే’ అంటూ తాము ప్రమాదంలో ఉన్నామన్న సంకేతాన్ని పంపాడు. అనంతరం సంభాషణ తెగిపోయింది.  

ఆ తర్వాత కొన్ని క్షణాలకే విమానం ఓ మొబైల్ టవర్‌ను ఢీకొట్టి జనావాసాల్లో కుప్పకూలింది. రెండు రన్‌వేలు సిద్ధంగా ఉన్నాయని చెప్పినా పైలట్ గో-రౌండ్ (గాల్లో చక్కర్లు కొట్టేందుకే) మొగ్గు చూపాడని ఏటీసీ అధికార ప్రతినిధి అబ్దుల్లా హెచ్.ఖాన్ తెలిపారు.

More Telugu News