Anantapur District: కర్ణాటక వెళ్లాలని.. ఏపీఎస్ ఆర్టీసీ బస్సు దొంగతనం.. చివరికి కటకటాలపాలు!

Man Theft Apsrtc bus to go to Karnataka
  • ధర్మవరం డిపో నుంచి బస్సు చోరీ
  • కొత్త వ్యక్తి బస్సు తీసుకెళ్లడంతో అనుమానం
  • వెంబడిస్తూ పోలీసులకు సమాచారం ఇచ్చిన డ్రైవర్
లాక్‌డౌన్ కారణంగా ఏపీలో చిక్కుకుపోయిన కర్ణాటక వ్యక్తి సొంతూరు వెళ్లేందుకు మరోమార్గం లేక ఏకంగా ఆర్టీసీ బస్సునే దొంగిలించాడు. అయితే, ఎవరో ముక్కూమొహం తెలియని వ్యక్తి డ్రైవర్ సీట్లో ఉండడంతో అనుమానించిన ఓ డ్రైవర్ వెంబడించి మరీ పట్టుకోవడంతో ఆ దొంగ ప్లాన్ ఫ్లాప్ అయింది. ప్రస్తుతం కటకటాలు లెక్కపెట్టుకుంటున్నాడు.

ఇంతకీ ఏం జరిగిందంటే.. కర్ణాటకకు చెందిన పూజా బిల్లీఖాన్ బెంగళూరు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. అయితే, అంతరాష్ట్ర బస్సు సర్వీసులు నడవకపోవడంతో ఏకంగా బస్సునే దొంగిలించి అందులోనే దర్జాగా స్వగ్రామం చేరుకోవాలని భావించాడు. అనుకున్నదే తడవుగా అనంతపురం జిల్లా ధర్మవరం ఆర్టీసీ బస్సు డిపోలోకి వెళ్లాడు. అదను చూసి ఓ బస్సు తీసుకుని బయలుదేరాడు. అయితే, ఎవరో కొత్త వ్యక్తి బస్సును తీసుకెళ్తుండడంతో అనుమానించిన ఓ డ్రైవర్ బైక్‌పై అతడిని వెంబడించాడు. అదే సమయంలో పోలీసులకు సమాచారం అందించాడు.
 
సమాచారం అందుకున్న పెనుకొండ మండలం అమ్మవారిపల్లి వద్ద ఉన్న ఇండస్ట్రియల్ పోలీసులు రంగంలోకి దిగి దొంగను అదుపులోకి తీసుకుని బస్సును స్వాధీనం చేసుకున్నారు. విచారణ అనంతరం దొంగను ధర్మవరం పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News

Anantapur District
Dharmavaram
apsrtc bus