Karnataka: వధూవరులకు కర్ణాటక ప్రభుత్వం పచ్చజెండా.. రానున్న రెండు ఆదివారాల్లో పెళ్లిళ్లు చేసుకోవచ్చు!

  • ఈ నెల 24, 31 తేదీల్లో మంచి ముహూర్తాలు 
  • ఇప్పటికే పెళ్లి నిశ్చయం చేసుకున్న కుటుంబాలు
  • ముందే నిర్ణయించుకున్న వారికి అనుమతి
  • ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలను పాటించాల్సిందే
marriages in karnataka

కరోనా విజృంభణ నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌తో దేశ వ్యాప్తంగా లక్షలాది వివాహాలు వాయిదా పడ్డ విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పెళ్లి వేడుక జరుపుకోవాలనుకుంటున్న వారికి  కర్ణాటక ప్రభుత్వం శుభవార్త తెలిపింది. రాబోయే రెండు ఆదివారాలు వివాహాలు చేసుకోవచ్చని చెప్పింది.

ఈ నెల 24, 31 తేదీల్లో ముహూర్తాలు ఉన్నాయి. ఈ ఆదివారాల్లో వివాహం చేసుకోవాలని ముందే నిర్ణయించుకున్న వారికి అనుమతి ఇస్తామని కర్ణాటక ప్రభుత్వాధికారి ఒకరు మీడియాకు తెలిపారు. అయితే, పెళ్లి వేడుకల విషయంలో కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలను పాటించాలని ఆయన చెప్పారు.

50 లోపు మాత్రమే అతిథులు హాజరయ్యేలా చూసుకోవాలని తెలిపారు. అలాగే, కంటైన్‌మెంట్‌ జోన్లకు చెందిన బంధు, మిత్రులను వ్యక్తులను వివాహాలకు ఆహ్వానించవద్దని తెలిపారు. 65 ఏళ్లు పైబడిన వారు, 10 ఏళ్లలోపు చిన్నారులు, గర్భిణులు కూడా ఈ వేడుకల్లో పాల్గొనవద్దని కర్ణాటక ప్రభుత్వం తెలిపింది.

More Telugu News