YV Subba Reddy: సగం ధరకే తిరుమల లడ్డూ... వెంకన్న దర్శనం ఎప్పటినుంచో ఇప్పుడే చెప్పలేను: వైవీ సుబ్బారెడ్డి

  • రూ. 50 విలువైన లడ్డు రూ. 25కే
  • అన్ని జిల్లాల టీటీడీ కల్యాణమండపాల్లో అందుబాటులో
  • హైదరాబాద్ సమాచార కేంద్రంలో కూడా
  • టీటీడీలో నిధుల కొరత లేదన్న వైవీ
Tirumala Laddu for Half Price

లాక్ డౌన్ నిబంధనలు తొలగేంత వరకూ భక్తులు పరమ పవిత్ర ప్రసాదంగా భావించే తిరుమల లడ్డూలను తిరుపతిలో సగం ధరకే విక్రయిస్తామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. భక్తుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని, రూ. 50 ధర ఉన్న లడ్డూను రూ. 25కే భక్తులకు అందిస్తామని తెలిపారు. తాజాగా అడిషనల్ ఈవో ధర్మారెడ్డితో కలసి మీడియాతో మాట్లాడిన ఆయన, స్వామివారి దర్శనాలు ఎప్పటి నుంచి తిరిగి ప్రారంభం అవుతాయన్న విషయాన్ని చెప్పలేనని అన్నారు. ఆంధ్రప్రదేశ్ లోని జిల్లా కేంద్రాల్లో ఉన్న టీటీడీ కల్యాణ మండపాలతో పాటు హైదరాబాద్, చెన్నై, బెంగళూరు నగరాల్లో ఉన్న సమాచార కేంద్రాల్లో ప్రసాదాలను అందుబాటులోకి తెస్తామని తెలిపారు.

ఈ- హుండీ ద్వారా స్వామివారికి వస్తున్న ఆదాయం పెరిగిందని తెలిపిన వైవీ సుబ్బారెడ్డి, గత సంవత్సరం ఏప్రిల్ లో రూ. 1.79 కోట్లు రాగా, ఈ సంవత్సరం రూ. 1.97 కోట్ల ఆదాయం కానుకల రూపంగా వచ్చిందన్నారు. టీటీడీలో నిధుల కొరత ఉందని జరుగుతున్న ప్రచారం అవాస్తవమని స్పష్టం చేసిన ఆయన, ఆలయాల నిర్వహణకు, ఉద్యోగుల వేతనాలకు ఎలాంటి కొరతా లేదని, స్వామి అనుగ్రహంతో భవిష్యత్తులోనూ ఆ పరిస్థితి రాబోదన్న నమ్మకం ఉందని తెలిపారు.

More Telugu News