KTR: వలస కూలీల ఫోన్‌కు కేటీఆర్ స్పందన.. స్వస్థలాలకు పంపాలంటూ కలెక్టర్‌కు ఆదేశం

  • ఒడిశా నుంచి పని కోసం ముస్తాబాద్‌కు కూలీలు
  • పని లేకపోవడంతో కాలినడకన ఒడిశా పయనం
  • కేటీఆర్ చొరవతో వాహనం ఏర్పాటు చేసి స్వరాష్ట్రానికి పంపిన కలెక్టర్
Telangana Minister KTR responded to Migrant workers phone call

వలస కూలీల నుంచి వచ్చిన ఫోన్‌కాల్‌కు స్పందించిన తెలంగాణ మంత్రి కేటీఆర్.. వారిని స్వస్థలాలకు పంపే ఏర్పాట్లు చేయాలంటూ కలెక్టర్‌ను ఆదేశించారు. ఒడిశాకు చెందిన కూలీలు కొంతకాలం క్రితం పనికోసం ముస్తాబాద్ వచ్చారు. ప్రస్తుతం లాక్‌డౌన్ కారణంగా పనిలేకపోవడంతో వారంతా కాలినడకన స్వస్థలాలకు బయలుదేరారు. ఇలా నడుస్తూ రెండు రోజుల క్రితం పెద్దూరు చేరుకున్నారు. స్థానిక నాయకులు కొందరు వారికి ఆశ్రయం కల్పించి రెండు రోజులుగా వారికి భోజనాలు అందిస్తున్నారు. అయితే, ఇక్కడి నుంచి వీరు సొంతూళ్లకు వెళ్లేందుకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో అక్కడే చిక్కుకుపోయారు.

దీంతో నిన్న రాత్రి వారు మంత్రి కేటీఆర్‌కు ఫోన్ చేసి తమ గోడు వినిపించారు. వెంటనే స్పందించిన కేటీఆర్.. కలెక్టర్‌తో మాట్లాడి వారిని స్వస్థలాలకు పంపాల్సిందిగా ఆదేశించారు. దీంతో అప్పటికప్పుడు వారి కోసం ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేసి ఒడిశా తరలించారు. తమ ఫోన్ కాల్‌కు స్పందించి వాహనం ఏర్పాటు చేసిన కేటీఆర్ ‌కు వలస కూలీలు కృతజ్ఞతలు తెలిపారు.

More Telugu News