AP Government: ఏపీలో లాక్ డౌన్ ఎగ్జిట్ ప్లాన్.. సీఎం జగన్ కీలక ఆదేశాలు

  • సినిమాహాళ్లు, రెస్టారెంట్లు.. ఎలా కొనసాగించాలనే దానిపై చర్చ
  • దీనిపై ప్రణాళిక అందించాలి..నిర్దిష్ట విధానాలు సిద్ధం చేయాలి
  • ఉన్నతాధికారులతో సీఎం జగన్ సమావేశం
AP Cm Jagan orders to implement lockdown exit plan

ఏపీలో కరోనా వైరస్ కట్టడి చేస్తూనే లాక్ డౌన్ ఎగ్జిట్ ప్లాన్ అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు ఉన్నతాధికారులతో జరిగిన సమావేశంలో సీఎం జగన్ కీలక ఆదేశాలు జారీ చేశారు. ఎగ్జిట్ ప్లాన్ లో భాగంగా సినిమాహాళ్లు,  రెస్టారెంట్లు, ప్రజా రవాణా, విద్యా సంస్థల కార్యకలాపాలను ఏ రకమైన జాగ్రత్తలు తీసుకుంటూ కొనసాగించాలనే దానిపై నిర్దిష్ట విధానాలు సిద్ధం చేయాలని, దీనిపై ప్రణాళికను అందించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని కంటైన్ మెంట్ క్లస్టర్లలో అనుసరించాల్సిన వ్యూహంపై జగన్ కు అధికారులు తమ ప్రతిపాదనలు అందించారు.

రాష్ట్రంలో 290 క్లస్టర్లు ఉన్నాయని, ఇందులో 75 క్లస్టర్లలో ఇరవై ఎనిమిది రోజులుగా కొత్త కేసులేవీ నమోదు కాలేదని అధికారులు తెలిపారు. వాటిని డీనోటిఫై చేసి సాధారణ కార్యకలాపాలకు అనుమతి ఇవ్వాలని నిర్ణయించినట్టు సమాచారం. టెలీ మెడిసిన్ విధానాన్ని మరింత పటిష్టం చేసే చర్యల్లో భాగంగా ప్రతి పీహెచ్ సీకి ఒక బైక్ ఇవ్వాలని, జులై 1 నాటికి అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను జగన్ ఆదేశించారు. ఏపీలో చిక్కుకుపోయిన వివిధ రాష్ట్రాల వలస కూలీలను వారి స్వస్థలాలకు పంపే ఆలోచన చేయాలని, వారికి ఆహారం విషయంలో ఇబ్బంది లేకుండా చూడాలని ఆదేశించారు.

More Telugu News