DRDO: కరెన్సీ, స్మార్ట్ ఫోన్ల కోసం శానిటైజర్ ను తయారు చేసిన హైదరాబాద్ డీఆర్డీఓ!

  • డ్రువ్స్  పేరిట సరికొత్త పరికరం
  • శానిటైజ్ చేయడం పూర్తికాగానే స్లీప్ మోడ్ లోకి
  • ఎవరూ తాకాల్సిన అవసరం లేదని వెల్లడి
DRDO Lab Develops Contactless Sanitiser for Phones and Currency

కరెన్సీ నోట్లతో పాటు స్మార్ట్ ఫోన్లు, ఐపాడ్ లు, చలాన్లు తదితరాలను శానిటైజ్ చేసేందుకు డిఫెన్స్ రీసెర్చ్ అల్ట్రావయోలెట్ శానిటైజర్ పేరిట ముట్టుకోనవసరం లేని శానిటైజేషన్ క్యాబినెట్ ను హైదరాబాద్ లోని డీఆర్డీఓ (డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ ఆర్గనైజేషన్) అభివృద్ధి చేసింది.

ఈ పరికరంలోని ప్రాక్సిమిటీ సెన్సార్ స్విచ్ ద్వారా దీన్ని తెరవడం, మూయడం చేయవచ్చని, ఎవరూ దీన్ని తాకాల్సిన అవసరం లేదని డీఆర్డీఓ అధికారి ఒకరు వెల్లడించారు. ఇందులో వేసిన పరికరాలపై 360 డిగ్రీల కోణంలో అల్ట్రా వయోలెట్ కిరణాలు ప్రసరిస్తాయని, ఒకసారి శానిటైజేషన్ ప్రక్రియ పూర్తికాగానే సిస్టమ్ స్లీప్ మోడ్ లోకి వెళ్లిపోతుందని పేర్కొన్నారు.

ఈ మేరకు రక్షణ మంత్రిత్వ శాఖ ఓ ట్వీట్ చేస్తూ, "ఆటోమేటెడ్ కాంటాక్ట్ లెస్ యూవీసీ శానిటైజేషన్ క్యాబినెట్ (డ్రువ్స్)ను హైదరాబాద్ డీఆర్డీఓ అభివృద్ధి చేసింది. దీనితో మొబైల్ ఫోన్లు, ఐపాడ్ లు, ల్యాప్ టాప్స్, కరెన్సీ నోట్లు, చెక్కులు, చలాన్లు, పాస్ బుక్స్, పేపర్ కవర్లను క్రిమి రహితం చేసుకోవచ్చు. ఇదే సమయంలో 'నోట్స్ క్లీన్' పేరిట ఆటోమేటెడ్ యూవీసీ కరెన్సీ శానిటైజింగ్ పరికరాన్ని కూడా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు" అని పేర్కొంది.

More Telugu News