Zoom App: కేంద్రం సూచనలను పట్టించుకోకుండా జూమ్ యాప్ ను విపరీతంగా డౌన్ లోడ్ చేసిన భారతీయులు!

  • లాక్ డౌన్ నేపథ్యంలో జూమ్ యాప్ కు గిరాకీ
  • ఈ యాప్ లో భద్రత కష్టమేనన్న కేంద్రం
  • ఏప్రిల్ లో ప్రపంచవ్యాప్తంగా 131 మిలియన్ల డౌన్ లోడ్లు
Indians downloads Zoom App in a heavy manner

ఇటీవల కాలంలో నెట్టింట ఎక్కువగా వినిపిస్తున్న పేరు జూమ్ యాప్. కరోనా ప్రభావంతో లాక్ డౌన్ విధించిన నేపథ్యంలో వర్క్ ఫ్రమ్ హోమ్ విధానం వాడుకలోకి రావడంతో ఈ యాప్ వినియోగం బాగా పెరిగింది. ఒకేసారి పెద్ద సంఖ్యలో వ్యక్తులతో వీడియో కాల్ చేసే సౌలభ్యం ఉండడంతో కార్పొరేట్ వ్యక్తులకు ఇది ఉపయుక్తంగా మారింది. లాక్ డౌన్ తో ఇంటికే పరిమితమైన యువత కూడా మిత్రబృందాలతో చర్చలకు ఈ యాప్ ను అడ్డాగా చేసుకుంటోంది.

అయితే, ఈ యాప్ వినియోగించే సమయంలో భద్రతాపరమైన సమస్యలు ఎదురవుతున్నట్టు భారత ప్రభుత్వం గుర్తించింది. యూజర్ల వివరాలకు జూమ్ యాప్ లో భరోసా కనిపించడంలేదని పేర్కొంటూ అధికారులు ఈ యాప్ వినియోగించవద్దంటూ ఆదేశించింది. ప్రైవేటు వ్యక్తులు ఈ యాప్ ను వినియోగించే సమయంలో అనేక జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేసింది. అయితే కేంద్రం సూచనలు అటుంచితే, ఏప్రిల్ మాసంలో ఈ యాప్ ను ప్రపంచవ్యాప్తంగా డౌన్ లోడ్ చేసుకున్న వారిలో భారతీయులు అధికంగా ఉన్నట్టు వెల్లడైంది.

గత నెలలో జూమ్ యాప్ ను 131 మిలియన్ల మంది డౌన్ లోడ్ చేసుకోగా, అందులో భారత్ వాటా 18.2 శాతం అని యాప్ ఇంటెలిజెన్స్ సంస్థ 'సెన్సార్ టవర్' వెల్లడించింది.  భారత్ తర్వాత ఈ యాప్ ను ఎక్కువగా డౌన్ లోడ్ చేసుకుంటున్నది అమెరికన్లేనట. ఇక, ప్రముఖ వీడియో షేరింగ్ యాప్ టిక్ టాక్ కూడా మాంచి ఊపు కనబరుస్తోంది. ఏప్రిల్ నెలలో టిక్ టాక్ ను భారీగా డౌన్ లోడ్ చేసుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా 107 మిలియన్ల డౌన్ లోడ్లు జరిగినట్టు గుర్తించారు. భారత్ నుంచే 22 శాతం డౌన్ లోడ్లు వచ్చాయని 'సెన్సార్ టవర్' వివరించింది.

More Telugu News