KCR: తెలంగాణలో ఏ జిల్లా ఏ జోన్ లో... వివరించిన సీఎం కేసీఆర్

  • తెలంగాణలో తగ్గుముఖం పడుతున్న కేసులు
  • ఆగస్ట్ కల్లా వ్యాక్సిన్ రావొచ్చన్న సీఎం కేసీఆర్
  • ఆరు జిల్లాలు రెడ్ జోన్ లో ఉన్నాయని వెల్లడి
CM KCR explains zone wise corona infected areas in state

తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతోందని, ఆగస్ట్ సమయానికి వ్యాక్సిన్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని సీఎం కేసీఆర్ వివరించారు. సుదీర్ఘంగా సాగిన మీడియా సమావేశం ముగిసిన అనంతరం ఆయన ప్రెస్ మీట్ లో మాట్లాడారు. భారత్ బయోటెక్, బీఈ, శాంతాబయోటెక్ సంస్థలు వ్యాక్సిన్ పరిశోధనలు సాగిస్తున్నాయని తెలిపారు. ప్రజలు స్వీయ నియంత్రణలో ఉంటేనే కరోనా కట్టడి సాధ్యమని స్పష్టం చేశారు. రాష్ట్రం మొత్తమ్మీద ఇప్పటివరకు 628 కరోనా నుంచి కోలుకున్నారని తెలిపారు.

కేంద్రం మార్గదర్శకాలకు అనుగుణంగా కరోనా ప్రభావిత ప్రాంతాలను రెడ్ జోన్, ఆరెంజ్ జోన్ గా, కరోనా లేని ప్రాంతాలను గ్రీన్ జోన్ గా విభజించారని తెలిపారు. తెలంగాణలో 6 జిల్లాలు రెడ్ జోన్ లో ఉన్నాయని, సూర్యాపేట, వికారాబాద్, మేడ్చల్, హైదరాబాద్, రంగారెడ్డి, వరంగల్ అర్బన్  జిల్లాలు రెడ్ జోన్ కింద ఉన్నాయని వివరించారు.

ఇక, యాదాద్రి భువనగిరి, వరంగల్ రూరల్, వనపర్తి, భద్రాద్రి కొత్తగూడెం, సిద్ధిపేట్, ములుగు, మహబూబాబాద్, నాగర్ కర్నూలు, పెద్దపల్లి జిల్లాలు గ్రీన్ జోన్ లో ఉన్నాయని చెప్పారు.

మరో 18 జిల్లాలు ఆరెంజ్ జోన్ లో ఉన్నాయని సీఎం కేసీఆర్ తెలిపారు. సంగారెడ్డి, మహబూబ్ నగర్, మెదక్, జయశంకర్ భూపాలపల్లి, కామారెడ్డి, కరీంనగర్, జగిత్యాల్, మంచిర్యాల్, నారాయణపేట్, రాజన్న సిరిసిల్ల, నల్గొండ, నిజామాబాద్, ఆదిలాబాద్, ఖమ్మం, జనగామ, కొమురం భీమ్ ఆసిఫాబాద్, నిర్మల్, జోగులాంబ గద్వాల జిల్లాలు ఆరెంజ్ జోన్ లో ఉన్నాయని పేర్కొన్నారు. కేంద్రం మార్గదర్శకాల ప్రకారం ఆయా జోన్ల పరిధిలో నియమ నిబంధనలు వర్తిస్తాయని స్పష్టం చేశారు.

More Telugu News