Ghatkesar: తెలంగాణ నుంచి కదిలిన రెండో శ్రామిక్ రైలు!

  • ఘట్ కేసర్ నుంచి పట్నాకు శ్రామిక్ రైలు
  • 1,250 మందితో వెళ్లిన రైలు
  • రేపటి నుంచి మరిన్ని రైళ్లు
Second Special Train Started from Telangana

లాక్ ‌డౌన్ కారణంగా తెలంగాణలో చిక్కుబడిపోయి, తమ స్వస్థలాలకు వెళ్లలేకపోయిన కార్మికులతో రెండో ప్రత్యేక రైలు ఈ తెల్లవారుజామున బయలుదేరింది. మొత్తం 1,250 మంది కార్మికులతో ఘట్ ‌కేసర్ నుంచి బీహార్ రాజధాని పట్నాకు తెల్లవారుజామున 3.20 నిమిషాలకు శ్రామిక్‌ ప్రత్యేక రైలు కదిలిందని అధికారులు వెల్లడించారు.

నోడల్ అధికారులు గుర్తించిన కార్మికులకు ఈ రైలులో ప్రయాణించే అవకాశాన్ని కల్పించామని మేడ్చల్ కలెక్టర్‌ వెల్లడించారు. రాచకొండ సీపీ, నోడల్ అధికారులతో కలిసి రైల్వే స్టేషన్ ను పరిశీలించిన ఆయన, ఈ ప్రాంతంలో బిహార్ కార్మికుల సంఖ్య అధికమని, వారిని గుర్తించి ప్రత్యేక రైలులో స్వరాష్ట్రానికి పంపించామని పేర్కొన్నారు.

ఈ ప్రక్రియ రెండురోజుల క్రితమే మొదలైందని, వివిధ పోలీసు స్టేషన్లలో పేర్లు నమోదు చేసుకున్న వలస కార్మికులను పిలిపించి, వారికి రైలు ప్రయాణానికి అనుమతి పత్రాలను ఇచ్చామని తెలిపారు. కాగా, శుక్రవారం ఉదయం లింగంపల్లి నుంచి ఝార్ఖండ్‌లోని హతియాకు తొలి స్పెషల్ రైలు వెళ్లిన సంగతి తెలిసిందే. ఇంకా చిక్కుబడిపోయిన వలస కార్మికుల వివరాలు సేకరించి, బుధవారం నుంచి పూర్తిస్థాయిలో తరలింపు కార్యక్రమాలను చేపట్టనున్నట్టు అధికారులు తెలిపారు.

More Telugu News