సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు వేల మంది ప్రజలు... తలలు పట్టుకున్న అధికారులు!
- స్వస్థలాలకు చేర్చేందుకు రైళ్లు నడపాలని కేంద్రం ఆదేశం
- సికింద్రాబాద్ స్టేషన్ వద్ద స్వల్ప ఉద్రిక్తత
- అన్ని గేట్లనూ మూసివేసిన అధికారులు
మరోవైపు ప్రభుత్వం అనుమతించిన రైళ్లు మినహా ప్యాసింజర్ రైళ్లను తిప్పే అవకాశాలు లేవని, వచ్చిన వారు వెనక్కు వెళ్లిపోవాలని రైల్వే శాఖ అధికారులు కోరుతున్నా, ఎవరూ వినిపించుకోకుండా, స్టేషన్ లోనికి వెళ్లేందుకు ప్రయత్నించడంతో కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దీంతో, స్పందించిన పోలీసులు, స్టేషన్ కు వెళ్లేందుకు నాలుగు వైపులా ఉన్న దారులను మూసివేసి వచ్చిన వారికి సర్దిచెప్పి వెనక్కు పంపించారు. స్టేషన్ పరిసరాలను పరిశీలించిన నార్త్ జోన్ డీసీపీ కల్మేశ్వర్, ఎవరూ స్టేషన్ పరిసరాల్లోకి రాకుండా చర్యలు చేపట్టాలని పోలీసులను ఆదేశించారు.
కాగా, ఎవరినైనా స్వస్థలాలకు పంపాలంటే, అది ప్రభుత్వ అధికారుల నిర్ణయం మేరకే ఉంటుందని, స్టేషన్లలో టికెట్లు ఇవ్వబోమని, అసలు కౌంటర్లు కూడా తెరిచే పరిస్థితి లేదని రైల్వే శాఖ అధికారులు స్పష్టం చేశారు. స్టేషన్ కు వచ్చిన వారిని రైళ్లు ఎక్కేందుకు అనుమతించ బోమని, వారంతా తమతమ ప్రాంతాల అధికారులను సంప్రదించి, రైలు ప్రయాణానికి అవసరమైన అనుమతిని తీసుకోవాలని, ఏ రైలు ఎక్కాలన్న విషయాన్ని వారే తెలియజేస్తారని, సరైన పత్రాలు ఉంటేనే రైలు సమయానికి రెండు గంటల ముందు వైద్య పరీక్షలు చేసి అనుమతిస్తామని అధికారులు వెల్లడించారు.