Andhra Pradesh: ఏపీలో ప్రారంభంకానున్న మద్యం ఉత్పత్తి.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం!

  • ఏపీలో సోమవారం నుంచి మద్యం ఉత్పత్తి ప్రారంభం
  • 14 డిస్టిలరీలకు అనుమతిస్తూ ఉత్తర్వులు
  • మద్యం అమ్మకాలు పెరుగుతాయని భావిస్తున్న ప్రభుత్వం
AP govt gives permission for liquor production

లాక్ డౌన్ సడలింపుల్లో భాగంగా గ్రీన్ జోన్లలో మద్యం అమ్మకాలకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం నుంచి రాష్ట్రంలో మద్యం ఉత్పత్తికి వైసీపీ ప్రభుత్వం అనుమతించింది. ప్రభుత్వ ఉత్తర్వులతో... 45 రోజులుగా మూతపడిన డిస్టిలరీలు మళ్లీ తెరుచుకోనున్నాయి. ఎల్లుండి నుంచి ఉత్పత్తిని ప్రారంభించనున్నాయి.

చాలా రోజుల నుంచి మద్యం అమ్మకాలు లేకపోవడంతో... ఇప్పుడు లిక్కర్ అమ్మకాలు మరింత ఊపందుకునే అవకాశాలు ఉన్నాయని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర పరిశ్రమల శాఖ మద్యం ఉత్పత్తికి అనుమతిస్తూ ఈరోజు ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్న 14 డిస్టిలరీలకు మద్యం ఉత్పత్తికి అనుమతిస్తూ ఉత్తర్వులను వెలువరించింది.

కేంద్ర ప్రభుత్వం విధించిన మార్గదర్శకాలను డిస్టిలరీలు పాటించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. పరిమిత సంఖ్యలోనే సిబ్బంది విధులకు హాజరు కావాలని, సామాజిక దూరాన్ని పాటించాలని, మాస్కులను ధరించాలని తెలిపింది.

More Telugu News