Jagan: మా వాళ్లని తెచ్చుకుంటాం.. సహకరించండి: కేంద్ర విదేశాంగ మంత్రికి సీఎం జగన్ లేఖ

  • విదేశాల్లో ఉన్న తెలుగు వారిని తీసుకువస్తున్నామన్న సీఎం
  • కువైట్, దుబాయ్ లో రిజిస్ట్రేషన్ సమస్యలు వస్తున్నట్టు వెల్లడి
  • సమస్యలు పరిష్కరించాలంటూ కేంద్రానికి విజ్ఞప్తి
AP CM Jagan writes to External Affairs Minister Jayshankar

ఎల్లుండి నుంచి లాక్ డౌన్ సడలింపులు అమల్లోకి వస్తున్న నేపథ్యంలో, విదేశాలు, ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న ఏపీ ప్రజలను రాష్ట్రానికి తీసుకువచ్చేందుకు వైసీపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ విషయంలో సహకరించాలని కోరుతూ సీఎం జగన్ కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ కు లేఖ రాశారు. కువైట్, దుబాయ్ దేశాల్లో వలసదారుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరుగుతోందని, అయితే రిజిస్ట్రేషన్ సమయంలో తెలుగు వారికి ఇబ్బందులు ఎదురవుతున్నట్టు తమ దృష్టికి వచ్చిందని జగన్ తన లేఖలో వివరించారు.

విదేశాల్లో ఉన్న రాష్ట్ర ప్రజలకు రిజిస్ట్రేషన్ లో ఎదురవుతున్న సమస్యలను అక్కడి అధికారుల ద్వారా పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. స్వదేశానికి వస్తున్న వారి రిజిస్ట్రేషన్ వివరాలను రాష్ట్రాలకు అందించాలని, తద్వారా తాము క్వారంటైన్ ఏర్పాట్లు చేసుకోవడానికి వీలవుతుందని సీఎం జగన్ వివరించారు. కువైట్, దుబాయ్ వంటి గల్ఫ్ దేశాల్లో ఉన్న తెలుగువారిని వారి స్వస్థలాలకు తీసుకువచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, వారు స్వదేశం చేరుకునేందుకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవకుండా విదేశాంగ శాఖ చొరవ తీసుకోవాలని కోరారు.

More Telugu News