WHO: కరోనా సుదీర్ఘకాలం మనతోనే వుంటుంది.. చిన్న తప్పు కూడా చేయవద్దు: డబ్ల్యూహెచ్ఓ హెచ్చరిక

  • నియంత్రణలో ఉన్న దేశాల్లోనూ కరోనా తిరగబెడుతోంది
  • ఆఫ్రికా, అమెరికా దేశాల్లో ప్రమాదం అధికం
  • డబ్ల్యూహెచ్ఓ చీఫ్ టీడ్రాస్ అడ్హనామ్
WHO Warns Corona Will Travel Long Time with Us

భూ మండలంపై ఉన్న మానవాళితో సుదీర్ఘకాలం పాటు కరోనా మహమ్మారి కలిసి నడవనుందని, చాలా దేశాలు వైరస్ తొలి దశలోనే ఉన్నందున నియంత్రణా చర్యల విషయంలో చిన్న తప్పు కూడా చేయవద్దని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ హెచ్చరించింది. కరోనాను నియంత్రించారని భావించిన దేశాల్లోనూ తిరిగి కేసుల సంఖ్య పెరుగుతోందని, ముఖ్యంగా ఆఫ్రికా, అమెరికా దేశాల్లో ఈ ప్రమాదం అధికంగా పొంచివుందని డబ్ల్యూహెచ్ఓ చీఫ్ టీడ్రాస్ అడ్హనామ్ వ్యాఖ్యానించారు.

వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కొవిడ్-19ను మహమ్మారిగా జనవరి 30నే గుర్తించిందని, ఆ వెంటనే గ్లోబల్ ఎమర్జెన్సీని ప్రకటించామని, దీంతో చాలా దేశాలకు వైరస్ ను ఎదుర్కొనే ప్రణాళికలను రూపొందించుకునే సమయం లభించిందని ఆయన అన్నారు. తాజాగా జెనీవాలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, "పశ్చిమ యూరప్ లోని చాలా ప్రాంతాల్లో వైరస్ స్థిరంగా లేదా తగ్గుతూ ఉంది. కొన్ని దేశాల్లో బాధితుల సంఖ్య తక్కువగా కనిపిస్తున్నా, సెంట్రల్ మరియు సౌత్ అమెరికాలో, పశ్చిమ యూరప్, ఆఫ్రికా ప్రాంతాల్లో కేసులు పెరుగుతున్నాయి. ఈ మహమ్మారి విషయంలో చాలా దేశాలు తొలి దశలోనే ఉన్నాయి. ఈ దశలో ఏ చిన్న తప్పు కూడా చేయవద్దు. ఈ వైరస్ మనతో పాటు సుదీర్ఘకాలం పాటు ప్రయాణిస్తుందన్న విషయాన్ని గుర్తెరగాలి" అని ఆయన అన్నారు.

కాగా, అధికారిక గణాంకాల ప్రకారం, దేశవ్యాప్తంగా 1.75 లక్షల మంది వరకూ మరణించగా, 25 లక్షల మంది వ్యాధి బారిన పడ్డారు. ఇదే సమయంలో కరోనాపై అప్రమత్తం చేయడంలో డబ్ల్యూహెచ్ఓ విఫలమైందని అమెరికా తదితర దేశాలు ఆరోపించాయి. చైనాలో పుట్టిన మహమ్మారి ప్రభావాన్ని సరిగ్గా అంచనా వేసి, అలర్ట్ చేయనందున టీడ్రాస్ రాజీనామా చేయాలన్న డిమాండ్ ఊపందుకుంది.

More Telugu News