మూడు నెలల ఇంటి అద్దెలు అడగవద్దు: ఇంటి ఓనర్లకు సీఎం కేసీఆర్ ఆదేశం

KCR explains lock down regulations
  • మార్చి, ఏప్రిల్, మే నెలల అద్దెలు అడగొద్దని స్పష్టీకరణ
  • విద్యాసంస్థలు ఫీజులు పెంచరాదని ఆదేశం
  • పెన్షనర్లకు 75 శాతం వేతనాలు
కరోనా సంక్షోభం కారణంగా తెలంగాణలో ఇంటి అద్దెలు అడగవద్దని సీఎం కేసీఆర్ ఇంటి ఓనర్లను ఆదేశించారు. మార్చి, ఏప్రిల్, మే నెలల ఇంటి అద్దెలు ఇవ్వాలని ఎవరినీ అడగవద్దని స్పష్టం చేశారు. ప్రజల వద్ద ఆదాయం లేదు కాబట్టి ఎవరూ వసూలు చేయవద్దని, ఇది విజ్ఞప్తి కాదని, ప్రత్యేక చట్టం ప్రకారం ఆదేశంగా పరిగణించాలని అన్నారు. ఇళ్ల కిరాయిలు వాయిదా వేశాం కాబట్టి వడ్డీలు కట్టాలని ఎవరినీ బలవంతం చేయరాదని తెలిపారు. విద్యాసంస్థలు 2020-21 సీజన్ కు ఒక్క పైసా కూడా ఫీజులు పెంచేందుకు వీల్లేదని తేల్చి చెప్పారు. నెలవారీ ట్యూషన్ ఫీజులు మాత్రమే వసూలు చేయాలని, ఇది ప్రభుత్వ ఆదేశమని అన్నారు.

ఇక ఉద్యోగుల, పెన్షనర్ల వేతనాలపైనా స్పష్టత ఇచ్చారు. ఈ నెల కూడా ఉద్యోగుల జీతాల్లో 50 శాతం, ప్రజాప్రతినిధుల వేతనాల్లో 75 శాతం కోత ఉంటుందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. అయితే ఫ్యామిలీ పెన్షనర్లకు మాత్రం 75 శాతం వేతనాలు చెల్లించాలని నిర్ణయించామని చెప్పారు. వాస్తవ పెన్షనర్లు చనిపోయి, వారిపై ఆధారపడిన వారు తమకు 50 శాతం వేతనం సరిపోవడంలేదని, తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు తన దృష్టికి తీసుకువచ్చారని కేసీఆర్ వివరించారు. అందుకే ఫ్యామిలీ పెన్షనర్లకు ఈసారి 75 శాతం ఇవ్వాలని నిర్ణయించినట్టు వెల్లడించారు.

వైద్య సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది, హెచ్ఎండబ్ల్యూ సిబ్బంది, గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య సిబ్బందికి గతంలో ఇచ్చిన విధంగానే నగదు ప్రోత్సాహకం ఏప్రిల్ నెలకు కూడా వర్తింపజేస్తున్నామని, పోలీసులకు సైతం ఈ నెల జీతం ఇచ్చేటప్పుడు 10 శాతం సీఎం కానుకగా ఇవ్వాలని క్యాబినెట్ నిర్ణయించినట్టు తెలిపారు. విద్యుత్ కార్మికులు సైతం అద్భుతమైన సేవలు అందించారని, వారికి పూర్తి జీతం ఇస్తున్నామని వెల్లడించారు.
Go Back to Shorts
KCR
Telangana
Lockdown

More Telugu News