COVID-19: భారత్‌ వంటి దేశాలకు ఐరాస ప్రధాన కార్యదర్శి గుటెరస్‌ 'సెల్యూట్‌'!

UN Chief  Salutes Nations Like India For Helping World Fight COVID 19
షార్ట్స్‌లో చూడండి
ప్రపంచాన్ని వణికిస్తోన్న కొవిడ్‌-19 సమస్య పరిష్కారం కోసం ఇతర దేశాలకు సాయపడుతున్న దేశాలకు ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ సెల్యూట్ చేశారని ఐరాస ప్రతినిధి ఒకరు తెలిపారు. భారత్ ఇటీవలే అమెరికాతో పాటు పలు దేశాలకు హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ను సరఫరా చేసిన విషయం తెలిసిందే.

కొవిడ్-19 చికిత్సలో ఆ డ్రగ్ సత్ఫలితాలనిస్తుందని అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్‌ కొన్ని వారాల క్రితం గుర్తించింది. కరోనా వైరస్‌ విజృంభణ నేపథ్యంలో ప్రపంచం పట్ల అన్ని దేశాలు సంఘీభావం తెలపాలని, ఇతర దేశాలకు సాయం చేసే సామర్థ్యం ఉన్న దేశాలు... ఆ పని చేయాలని గుటెరస్ కోరారని ఐరాస ప్రతినిధి స్టీఫెన్‌ డుజార్రిక్ చెప్పారు.

ఇటువంటి పనులు చేస్తోన్న దేశాలకు ఐరాస సెల్యూట్‌ చేస్తుందని గుటెరస్‌ అన్నారని తెలిపారు. స్టీఫెన్‌ డుజార్రిక్ మీడియాతో మాట్లాడుతుండగా భారత్‌ ఇతర దేశాలకు చేస్తోన్న సాయం గురించి విలేకరులు పశ్నించగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

కరోనా వైరస్‌ సమస్య ఎదుర్కొంటున్న దాదాపు 55 దేశాలకు హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ను సరఫరా చేయాలని భారత్‌ భావిస్తోంది. ఆఫ్ఘనిస్థాన్, భూటాన్, బంగ్లాదేశ్, నేపాల్‌, మాల్దీవులు, శ్రీలంక, మయన్మార్లకు ఔషధాలు పంపుతోంది. అలాగే, జాంబియా, ఉగాండా, కాంగో, ఈజిప్ట్‌, ఆర్మేనియా, ఈక్వెడార్, సిరియా, ఉక్రెయిన్‌, చాంద్, జింబాబ్వే, ఫ్రాన్స్ , కెన్యా, నెదర్లాండ్స్‌, నైజీరియా, ఒమన్, పెరూ వంటి దేశాలకు కూడా హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ను సరఫరా చేస్తోంది.
Go Back to Shorts
COVID-19
India
Corona Virus

More Telugu News