Gujarath: కరోనా సోకిన ఎమ్మెల్యే కలసిన నేపథ్యంలో: గుజరాత్‌ సీఎంకి వైద్య పరీక్షలు.. ప్రస్తుతం సెల్ఫ్‌ క్వారంటైన్‌లో సీఎం!

  • రూపానీ ఆరోగ్యం బాగానే ఉందని ప్రకటన
  • ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వం
  • మరో ఇద్దరు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు కూడా స్వీయ నిర్బంధంలోకి
Guj CM Vijay Rupani Self Isolate As Congress MLA Tests COVID19 Positive

నిన్న గుజరాత్ ఎమ్మెల్యే ఇమ్రాన్ ఖేడ్వాలా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిని కలవడం.. అనంతరం పరీక్షల్లో సదరు ఎమ్మెల్యేకి కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్ రూపానీ ప్రస్తుతం సెల్ఫ్‌ క్వారంటైన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆయనకు ఈ రోజు కరోనా వైద్య పరీక్షలు నిర్వహించారు.

నిన్న గుజరాత్‌ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇమ్రాన్ ఖేడ్వాలాకు కరోనా సోకినట్లు వైద్యులు గుర్తించారు. ఆయన ముఖ్యమంత్రిని కలిసిన సమయంలో ఆ సమావేశానికి హాజరైన మరో ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఇప్పటికే సెల్ఫ్ క్వారంటైన్‌కు పంపారు. ఇమ్రాన్‌ ఖేడ్వాలా విజయ్ రూపానీని తాకనప్పటికీ ముందు జాగ్రత్త చర్యగా ఆయనకు పరీక్షలు నిర్వహించారు. అనంతరం ఆయన ఆరోగ్యం బాగానే ఉందని వైద్యులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్లు తెలిసింది. అయినప్పటికీ ముందు జాగ్రత్తగా ఆయన స్వీయ నిర్బంధంలోకి వెళ్లారని గుజరాత్‌ ప్రభుత్వాధికారులు అంటున్నారు.  

ఇదిలావుంచితే, గుజరాత్‌లో ఇప్పటివరకు 615 కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి.
వారిలో 59 మంది కోలుకున్నారు. ఇప్పటివరకు ఆ రాష్ట్రంలో 28 మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా ఇంతగా విజృంభిస్తోన్న నేపథ్యంలో సీఎంకి కూడా ఆ ముప్పు ఉండడం పట్ల గుజరాత్‌లో ఆందోళన నెలకొంది.

More Telugu News