Kinjarapu Ram Mohan Naidu: సీఎంల సమావేశంలో జగన్ వ్యాఖ్యలు బాధాకరం: ఎంపీ రామ్మోహన్ నాయుడు

  • సీఎంలతో మోదీ వీడియో కాన్ఫరెన్స్
  • జగన్ అవగాహన లేకుండా మాట్లాడారని రామ్మోహన్ విమర్శలు
  • మంత్రులదీ అదే ధోరణి అంటూ మండిపాటు
TDP MP Ram Mohan Naidu slams CM Jagan

ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీ నిర్వహించిన సీఎంల వీడియో సమావేశంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్ మాట్లాడిన తీరుపై టీడీపీ యువ ఎంపీ రామ్మోహన్ నాయుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సీఎంల సమావేశంలో జగన్ వ్యాఖ్యలు బాధాకరమని రామ్మోహన్ నాయుడు అన్నారు.

కరోనా పట్ల ఏమాత్రం తీవ్ర దృక్పథం లేనట్టు జగన్ ప్రధానితో మాట్లాడారని ఆరోపించారు. లాక్ డౌన్ కొన్ని జోన్లకే పరిమితం చేయాలని ప్రధానితో అనడం బాధ్యతా రాహిత్యమేనని విమర్శించారు. ఇతర రాష్ట్రాలలో సీఎంలు నిత్యం ప్రజలతో మాట్లాడుతూ వారిలో ఆత్మవిశ్వాసం నింపేందుకు ప్రయత్నిస్తుంటే, ఏపీలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి సీఎం ప్రజల ముందుకు వచ్చే పరిస్థితి కూడా కనిపించడం లేదని విమర్శించారు.

ఇక సీఎంకు తోడు మంత్రులు సైతం అదేవిధంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మాస్కులు కావాలని ప్రజలు అడుగుతుంటే మీకవసరం లేదని మంత్రులు అవగాహనా రాహిత్యంతో మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం లాక్ డౌన్ కొనసాగిస్తే సామాన్యుడి మనుగడకు ఎలాంటి చర్యలు తీసుకుంటారో ప్రభుత్వం వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు. 

More Telugu News