Telangana: పెద్దపల్లిలో దారుణం.. వరుసగా మరణిస్తున్న శునకాలు.. స్థానికుల్లో భయాందోళనలు

  • ఒక రోజులోనే 12 శునకాలు మృతి
  • గ్రామంలో హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేసిన తర్వాత మరణిస్తున్న శునకాలు
  • భయం వద్దన్న పశువైద్యాధికారులు
Dogs dying in Peddapally panic among locals

తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా ఓడేడ్ గ్రామంలో వరుసగా శునకాలు చనిపోతుండడంతో స్థానికుల్లో భయాందోళనలు నిండుకున్నాయి. ఇక్కడ ఒక రోజు వ్యవధిలోనే 12 వీధి కుక్కలు మృతి చెందాయి. అమెరికాలోని న్యూయార్క్ జూలో ఓ పులికి కరోనా వైరస్ సోకిందన్న వార్తల నేపథ్యంలో శునకాలకు కూడా అది సోకిందేమోనని భయపడుతున్నారు. వెంటనే ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. కుక్కల మృతిపై దర్యాప్తు చేస్తున్నట్టు పశువైద్యాధికారి హన్నన్ తెలిపారు.

మూడు రోజుల క్రితం వైరస్ నివారణ కోసం గ్రామంలో హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేశారని, ఆ తర్వాతే శునకాలు మరణిస్తున్నాయని అన్నారు. ఆ ద్రావణం పిచికారీ చేసిన ఆహారాన్ని తినడం వల్ల కానీ, లేదంటే ఆ నీటిని తాగడం వల్ల కానీ అవి మృతి చెంది ఉంటాయని అనుమానిస్తున్నారు. అలాగే, ఆహారం దొరక్కపోవడం వల్ల కూడా మరణించి ఉండొచ్చని, భయపడాల్సిన పనేమీ లేదని అన్నారు. శునకాలు మళ్లీ మరణించినట్టు తెలిస్తే పోస్టుమార్టం చేసి అసలు విషయం తెలుసుకుంటామని ఆయన పేర్కొన్నారు.

More Telugu News