America: అమెరికాలో కరోనాకు 11 మంది భారతీయుల బలి!

  • మరో 16 మంది భారతీయులకు కరోనా పాజిటివ్
  • మృతుల్లో నలుగురు ట్యాక్సీ డ్రైవర్లు
  • బాధితులు ఉత్తరాఖండ్, మహారాష్ట్ర, కర్ణాటక, ఉత్తరప్రదేశ్‌కు చెందిన వారు
11 Indians Die In America

అమెరికాలో కరోనా వైరస్ బారినపడి 11 మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. మరో 16 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. కరోనా రాకాసి బారినపడి అమెరికా వ్యాప్తంగా ఇప్పటి వరకు 14 వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోగా 4 లక్షల మందికిపైగా వైరస్ బారినపడ్డారు.

కరోనా కారణంగా చనిపోయిన భారతీయులందరూ పురుషులేనని, వారిలో 10 మంది న్యూయార్క్, న్యూజెర్సీ ప్రాంతాలకు చెందిన వారని తెలుస్తోంది. వీరిలో నలుగురు న్యూయార్క్‌లో ట్యాక్సీ డ్రైవర్లని అధికారులు తెలిపారు. అమెరికాలో సంభవిస్తున్న మరణాల్లో అత్యధికశాతం న్యూయార్క్‌లోనే నమోదవుతున్నాయి. ఇక్కడ దాదాపు 6 వేల మంది మృతి చెందారు. 1.38 లక్షల మంది బాధితులుగా మారారు. న్యూజెర్సీలో 1500 మంది చనిపోగా, 48 వేల కేసులు నమోదయ్యాయి.

ఈ ప్రాణాంతక వైరస్ కారణంగా ఫ్లోరిడాలో ఓ భారతీయుడు ప్రాణాలు కోల్పోయాడు.  కరోనా వైరస్ బారిన పడిన 16 మంది భారతీయులు (వీరిలో నలుగురు మహిళలు) సెల్ఫ్ క్వారంటైన్‌లో ఉన్నట్టు అధికారులు తెలిపారు. వీరిలో 8 మంది న్యూయార్క్‌కు చెందినవారు కాగా, ముగ్గురు న్యూజెర్సీ వారు ఉన్నారు. మిగిలిన వారు టెక్సాస్, కాలిఫోర్నియాకు చెందిన వారు.

వైరస్ బారినపడినవారు ఉత్తరాఖండ్, మహారాష్ట్ర, కర్ణాటక, ఉత్తరప్రదేశ్‌కు చెందినవారుగా అధికారులు గుర్తించారు. వీరిందరికీ సాయం అందించేందుకు ఇండియన్ రాయబార కార్యాలయాల అధికారులు ముందుకొచ్చారు. స్థానిక అధికారులు, ఇండియన్-అమెరికన్ సంస్థలతో సంప్రదింపులు జరుపుతున్నారు.

More Telugu News