Statue of Unity: కరోనాపై పోరాడేందుకు 'స్టాచ్యూ ఆఫ్ యూనిటీ'ని విక్రయిస్తున్నట్టు ఓఎల్ఎక్స్ లో ప్రకటన... కేసు నమోదు!

  • సర్దార్ సరోవర్ డామ్ వద్ద భారీ విగ్రహం 
  • యాడ్ ను తొలగించిన ఓఎల్ఎక్స్
  • ప్రభుత్వాన్ని అపఖ్యాతి పాలు చేయడానికేనన్న అధికారి  
Police Case on Unknown for post a ad to sale Statue of Unity

ఇండియాలో కరోనాపై పోరాడేందుకు అవసరమైన నిధుల కోసం, గుజరాత్ లోని నర్మదా నదిపై సర్దార్ సరోవర్ డామ్ వద్ద, కేవాడియా ప్రాంతంలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన 'స్టాచ్యూ ఆఫ్ యూనిటీ'ని విక్రయిస్తున్నామని, రూ. 30 వేల కోట్లు చెల్లించి, ఆసక్తి ఉన్నవారు దీన్ని కొనుగోలు చేయవచ్చని ఓఎల్ఎక్స్ లో కనిపించిన ఓ ప్రకటన తీవ్ర కలకలం రేపగా, గుర్తు తెలియని వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. దాదాపు 182 మీటర్ల ఎత్తున నిర్మించిన సర్దార్ పటేల్ ఉక్కు విగ్రహం, నిత్యమూ వేలమందిని ఆకర్షిస్తూ, గుజరాత్ కు ప్రధాన టూరిజం కేంద్రాల్లో ఒకటిగా నిలుస్తోంది.

"ఓ గుర్తు తెలియని వ్యక్తి ఓఎల్ఎక్స్ లో శనివారం నాడు ప్రకటన ఉంచాడు. స్టాచ్యూఆఫ్ యూనిటీని రూ. 30 వేల కోట్లకు విక్రయించి, ఆసుపత్రులకు హెల్త్ కేర్ ఎక్విప్ మెంట్ ను కొనుగోలు చేయనున్నామని పేర్కొన్నాడు. ఈ విషయమై కేసు నమోదు చేశాం" అని పోలీసు అధికారి ఒకరు తెలిపారు.

ఈ ప్రకటన గురించి, మెమోరియల్ అధికారులు దినపత్రికల్లో చూసిన తరువాత పోలీసులను సంప్రదించి, ఫిర్యాదు చేశారని, మోసం, ఫోర్జరీ సెక్షన్లతో పాటు, మహమ్మారి వ్యాధుల చట్టం, సమాచార సాంకేతిక చట్టాల్లోని సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని అధికారులు తెలిపారు.

ఈ యాడ్ ను పోస్ట్ చేసి, అది వైరల్ అయిన వెంటనే, వెబ్ సైట్ దాన్ని తొలగించిందని తెలిపారు. ప్రభుత్వాన్ని అపఖ్యాతి పాలుచేయడానికి, ప్రజలను తప్పుదోవ పట్టించడానికి నిందితుడు ఈ విధంగా చేశాడని స్టాచ్యూ ఆఫ్ యూనిటీ చీఫ్ అడ్మినిస్ట్రేటర్ వ్యాఖ్యానించారు. ఈ తరహా ప్రకటనలను నమ్మవద్దని కోరారు.

More Telugu News